టైం అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి గుంటూరు కారం సినిమాని కేవలం తెలుగులో మాత్రమే  రిలీజ్ చేస్తున్నాము. తమిళ్ గానీ మరే  ఇతర భాషల్లో డబ్ చేయడం లేదని నాగవంశీ  క్లారిటీ ఇచ్చారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక, హాసిని బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను 2024 జనవరి 13న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా అవుట్ అండ్ మాస్ అవతార్ లో కనిపించటంతో సినిమాపై అంచనాలను అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో.. హాట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నైపధ్యంలో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదని నిర్మాత నాగవంశీ తేల్చి చెప్పేసారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ మాటాడుతూ.. ఈ గుంటూరు కారం ఇతర భాషల్లో రిలీజ్ అవుతుందా అన్న ప్రశ్నకు బదులుగా.. టైం అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి ఈ సినిమాని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాము. తమిళ్ గానీ మరే ఇతర భాషల్లో డబ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే మహేష్ బాబు తాను రాజమౌళి సినిమాతోనే ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లాలనుకున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాని కేవలం రీజనల్ ఫిల్మ్ క్రిందే రిలీజ్ చేయాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఆ మేరకే ఇతర భాషల డబ్బింగ్ వద్దనుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి సినిమాలో ఎక్కువ శాతం యూనివర్శిల్ అప్పీల్ ఇచ్చే అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా అన్ని భాషలవాళ్ళను ఆకట్టుకునేలా చేస్తారు. అటు వంటి సినిమాతో పాన్ ఇండియాలోకి వెళ్లటం బెస్ట్ అని భావించినట్లున్నారు.

అలాగే గుంటూరుకారం సంక్రాంతికి రావడం ఖాయం అని తేల్చేశారు. ఒక వేళ ఇంకే సినిమా ఆ టైంలో రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య వస్తుంది తప్ప తమ సినిమాకి పోటీ కాదని అన్నారు. ఏ సినిమా అయిన వాయిదా పడుతుందేమో అనే ఉద్దేశ్యంతో అందరూ ముందుగానే స్లాట్ వేసి ఉంచుకుంటున్నారని తాను అనుకుంటున్నట్లు నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 11 నుంచి అమెరికాలో ప్రివ్యూలు ప్రారంభమవుతాయని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని సగానికి పైగా థియేటర్లను ఆక్రమించడం ఖాయమనేది నిజం.