మా ఎలక్షన్స్: లేడీస్ ని గౌరవవించని వాళ్ళను ఒప్పుకోము... నాగబాబును టార్గెట్ చేసిన కరాటే కళ్యాణి
ప్రెస్ మీట్ లో మాట్లాడిన నటి కరాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను ఏదైనా గట్టిగా మాట్లాడుతాను, కోపం వస్తే తిడతాను అన్న ఆమె, కొద్దిరోజులుగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని అన్నారు.
'మా' అధ్యక్ష ఎన్నికల వేడి రెండు నెలలకు ముందే టాలీవుడ్ లో హీటు పుట్టిస్తుంది. ఆర్టిస్ట్స్ మధ్య వాదప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వివాదాన్ని పెద్దది చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుత 'మా' పాలకవర్గం సంస్థ పరువు మసకబారేలా చేశారని... నిన్న నాగబాబు, ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి వివరణ ఇస్తూ నరేష్ 'మా' కమిటీ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే గత రెండేళ్లలో 'మా' తరుపున చేసిన కార్యక్రమాలను వివరించారు.
ఇక ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడిన నటి కరాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను ఏదైనా గట్టిగా మాట్లాడుతాను, కోపం వస్తే తిడతాను అన్న ఆమె, కొద్దిరోజులుగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని అన్నారు. మా అంటే అమ్ముతో సమానం, మీ అమ్మను మీరు కించ పరుచుకోకండి.. మీ అమ్మను మీరు అవమానించవద్దు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పదవుల కోసం కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, కుర్చీ మీద అంత ప్రేమ ఎందుకు అంటూ నిలదీశారు. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. ఒక కమిటీ ఫోర్స్ లో ఉన్నప్పుడు మరో కమిటీ ఎలా ఫార్మ్ చేస్తారు. బై లాస్ కి వ్యతిరేకం కమిటీలో ఉన్న సభ్యులు ఆరోపణలు చేస్తున్న వారి పక్కన నిల్చొని సమర్ధించడం తగదన్నారు. అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు.
ముఖ్యంగా కరోనా సమయంలో ఆర్టిస్ట్స్ కి సహాయం చేయడం కోసం ఎంతో కష్టపడ్డాము. చేసిన వారిని చేయలేదని అంటే, ఎంత బాధగా ఉంటుందని అన్నారు. 'మా' ప్రతిష్ట మసకబారిందని ఎలా అంటారు. అసలు ఆడవాళ్లంటే గౌరవం లేని వాళ్ళను మేము సపోర్ట్ చేయమని, మంచి కాండిడేట్ ని తీసుకురండి మేము కూడా ఓటేస్తాం అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము అంటూ, పక్కన ఉన్న వారు వారిస్తున్నా కోపంతో ఊగిపోయారు కరాటే కళ్యాణి.