మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ.. కంగనా రనౌత్పై కోల్కత్తాలో కేసు..
బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి రిజు దత్తా చేసిన ఫిర్యాదు మేరకు కోల్కత్తా పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు.
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌల్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆమెపై తాజాగా కేసు నమోదైంది. బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి రిజు దత్తా చేసిన ఫిర్యాదు మేరకు కోల్కత్తా పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. ఇటీవల బెంగాల్లో హింసాకాండ కొనసాగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి నుంచే భారీ అల్లర్లు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, తృణమూల్ నేతలపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు కాస్త హింసాకాండగా మారిందని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ వరుసగా ట్వీట్లు చేసింది. బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కార్యకర్తలకు దాడులకు తెగబడ్డారంటూ ఆమె ట్వీట్లు చేయడం వివాదాస్పదంగా మారింది.
కంగనా ట్వీట్లు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించిన ట్విట్టర్ ఏకంగా ఆమె అకౌంట్నే సస్పెండ్ చేసింది. శశ్వాతంగా ఆమెకి అకౌంట్ లేకుండా చేసింది. దీంతో ట్విట్టర్ పై ఆమె కూడా ఫైర్ అయ్యింది. అయితే ఈ ఇదే విషయంపై తృణమూల్ కాంగ్రెస్ నేత రిజు దత్తా.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంగనా రనౌత్ పై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిత్రాలను వక్రీకరించి కంగనా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని ఫిర్యాదు రావడంతో కోల్కతా పోలీసులు ఐపీసీ 153 ఎ, 504, 505 సెక్షన్లతో పాటు, ఐటీ చట్టంలోని 43, 66 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. దీనిపై కంగనా స్పందిస్తూ నా గొంతును చంపుతున్నారంటూ మమత బెనర్జీపై ఆరోపణలు చేశారు. కేసులు, సెక్షన్స్తో నన్ను భయపెట్టలేరన్నారు.