కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల `రూల్స్ రంజన్` ట్రైలర్ కి డేట్ ఫిక్స్
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలిసి నటిస్తున్న `రూల్స్ రంజన్` చిత్ర రిలీజ్ డేట్ని ఇటీవలే ప్రకటించారు. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది యూనిట్.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస పరాజయాల అనంతరం చివరిగా ఆయన `వినరో భాగ్యము విష్ణుకథ` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో హిట్ కోసం వస్తున్నారు. `డీజే టిల్లు` బ్యూటీతో రొమాన్స్ చేస్తూ `రూల్స్ రంజన్` చిత్రంలో నటించాడు. ఈ సినిమా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం.
ఇటీవల ఈ చిత్ర రిలీజ్ డేట్ని ప్రకటించారు. ప్రభాస `సలార్` వాయిదా పడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు సినిమాలోని నాలుగో పాటని కూడా ప్రదర్శించారు. ఇప్పటికే విడుదలైన 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా', 'ఎందుకురా బాబు' పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా గ్యాప్ లేకుండా మరో అప్ డేట్ ఇచ్చింది యూనిట్. ఈ చిత్ర ట్రైలర్ డేట్ని ప్రకటించారు. ఈ నెల 8న ట్రైలర్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది యూనిట్. శుక్రవారం ఉదయం 11.22గంటలకు `రూల్స్ రంజన్` ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు.
టీమ్ చెబుతూ, ``రూల్స్ రంజన్' చిత్ర ట్రైలర్ ను సెప్టెంబర్ 8న ఉదయం 11:22 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అసలే కిరణ్ అబ్బవరం-నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా, పైగా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. దానికి తోడు సినిమా విడుదల తేదీ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడిన మాటల్లో ఈ సినిమా పట్ల ఉన్న నమ్మకం చూస్తుంటే.. ఘన విజయం సాధించడం ఖాయమనిపిస్తోంది. రోజురోజుకి అంచనాలు పెరుగుతూ ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న బజ్ తో.. ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటంతో పాటు, పూర్తి స్థాయి వినోద భరితంగా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుంద`ని చిత్ర బృందం వెల్లడించింది.
వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే సహా పలువురు హిందీ నటులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు.దులీప్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, ఎం. సుధీర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.