కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. `ఆపరేషన్ సింధూర్` గురించి ప్రశంసలు కురిపించారు. మరి సుదీప్‌ ఏంచెప్పారనేది చూస్తే. 

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ఇండియా పాకిస్తాన్‌ యుద్ధంపై స్పందించారు. తాజాగా ఆయన మోడీకి లెటర్‌ రాశారు. ఇటీవల తన తల్లి మరణించిన నేపథ్యంలో ప్రధాని మోడీ సానుభూతి తెలపగా, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు సుదీప్‌.  `ఆపరేషన్ సింధూర్` విజయానికి ధన్యవాదాలు తెలిపారు.  సుదీప్‌ రాసిన లేఖని ఓ సారి చూస్తే. 

కిచ్చా సుదీప్
నటుడు, నిర్మాత, దర్శకుడు
తేదీ: 09 మే 2025

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి,
నమస్కారం.

ముందుగా, నా తల్లి శ్రీమతి సరోజా సంజీవ్ మరణం పట్ల మీరు పంపిన సానుభూతి లేఖకు ధన్యవాదాలు. ఆ క్లిష్ట సమయంలో మీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి.

నేడు ఒక కృతజ్ఞుడైన కొడుకుగానే కాదు, గర్వించదగ్గ భారతీయుడిగా కూడా ఈ లేఖ రాస్తున్నాను.

ఆపరేషన్ సింధూర్ విజయానికి దేశం అభినందనలు తెలుపుతోంది. నేను కూడా దీన్ని మెచ్చుకుంటున్నాను. ఇది కేవలం ప్రతిచర్య కాదు, ఒక ప్రకటన. భారత్ వెనక్కి తగ్గదు, మర్చిపోదు, ఎల్లప్పుడూ పైకి లేస్తుందనే సందేశం ప్రపంచానికి అందించింది.

మీలో మేము కేవలం మాటలతో నడిపించే నాయకుడినే కాదు, దృఢ సంకల్పంతో ముందుకు నడిపించే నాయకుడిని చూస్తున్నాము. ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన స్పష్టత, ఆత్మవిశ్వాసం మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ప్రతి కన్నడిగుడు, కన్నడ చిత్ర పరిశ్రమ మీ వెన్నంటే ఉంది. మీ ధైర్యం మాకు స్ఫూర్తి.

మీ నాయకత్వంలో మన రక్షణ దళాలు అద్భుతమైన కచ్చితత్వం, క్రమశిక్షణ, శౌర్యం ప్రదర్శించాయి. వారి విజయం మనందరికీ గర్వకారణం.

మనమంతా ఒకే జాతి, ఒకే స్వరం, ఒకే దేశంగా ఐక్యంగా నిలుద్దాం.

జై హింద్. జై కర్ణాటక. జై భారత్.

శ్రీ నరేంద్ర మోదీ,
మాన్య ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వం,
సౌత్ బ్లాక్, రైసీనా హిల్,
న్యూఢిల్లీ - 110011

గౌరవపూర్వకంగా,
సుదీప్ సంజీవ్,
భారతదేశ గర్వించదగ్గ కుమారుడు,
బెంగళూరు, కర్ణాటక.

#359, 17వ ఎ రోడ్, 26వ మెయిన్,
జె.పి.నగర్, 6వ దశ, బెంగళూరు - 560078

రెండు రోజుల క్రితం ఏమన్నారు?

రెండు రోజుల క్రితం 'ఆపరేషన్ సింధూర్' గురించి కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. "నేను భారతీయుడిగా.. ఈ పవిత్ర భూమి కుమారుడిగా, పహల్గాంలో జరిగిన దాడి బాధను అనుభవించాను. నేడు, న్యాయం గర్జన విన్నాను. ఆపరేషన్ సింధూర్: ఇది కేవలం మిషన్ కాదు, ఒక పవిత్ర ప్రతిజ్ఞ. భారతదేశ సింధూరానికి మునుపు మచ్చ పడింది..

మన సైనికులు దాని గౌరవాన్ని తిరిగి నిలిపారు. మన సైన్యానికి నా వందనాలు. మన ప్రధాని నరేంద్ర మోదీకి, రక్షణ నాయకత్వానికి ధన్యవాదాలు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ కూడా వందనాలు. భారత్ మర్చిపోదు. భారత్ క్షమించదు` అని తెలిపారు సుదీప్‌. ఆయన మన తెలుగులో `ఈగ`, `బాహుబలి` సినిమాల్లో మెరిసిన విషయం తెలిసిందే.