కిచ్చా సుదీప్పై కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుదీప్ కన్నడ అబ్బాయి కాదు, తెలుగు అబ్బాయినే అని తెలిపారు. హైదరాబాద్లోనే ఉంటున్నాడని తెలిపారు.
`ఈగ`, `సైరా`, `బాహుబలి` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న కిచ్చా సుదీప్పై కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుదీప్ కన్నడ అబ్బాయి కాదు, తెలుగు అబ్బాయినే అని తెలిపారు. హైదరాబాద్లోనే ఉంటున్నాడని తెలిపారు. నాగ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం `విక్రాంత్ రోణ`. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28న హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది.
చిత్ర ప్రమోషన్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ స్టేజ్పై `గీతాంజలి` చిత్రంలోని పాట తెలుగులో పాడిన దర్శకుడు అనూప్ భండారిని అభినందించారు. ఆనాటి రోజులను గుర్తు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సుదీప్ తెలుగువాడే అనడం ఆలోచింప చేస్తుంది. కరోనా కారణంగా `విక్రాంత్ రోణ` చిత్ర షూటింగ్ని హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించారు. అందులో వేసిన ప్రత్యేక సెట్లో దాదాపు 60-70 శాతం షూటింగ్ చేసినట్టు సుదీప్ తెలిపారు.
అయితే ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్లుగా సుదీప్ హైదరాబాద్లోనే ఉంటున్నాడట. అంతేకాదు ఏకంగా ఇక్కడ ఓ ఇళ్లు కూడా కొనుకున్నట్టు తెలుస్తుంది. ఇలా సుదీప్ చాలా రోజులుగా హైదరాబాద్లోనే ఉంటున్నాడని, ఆ ఉద్దేశ్యంతోనే సుదీప్ని తెలుగు అబ్బాయిని నాగ్ చెప్పడం విశేషం. ఇంకా నాగార్జున మాట్లాడుతూ, సుదీప్ అన్ని భాషలకు తెలిసిన నటుడు. ఇప్పుడు `విక్రాంత్ రోణ` చిత్రంతో మరోసారి అందరిని ఆకట్టుకునేందుకు వస్తున్నారు. ఆయన వాయస్ అంటే నాకు భయమేస్తుంది. అంతటి గాంభీర్యంగా ఉంటుంది. ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా ఉండబోతుందని అనిపిస్తుంది. త్రీడీలో వస్తోన్న సినిమా కావడంతో ఆ ఫీల్ అద్భుతంగా ఉండబోతుంది.
జనరల్గా అన్నపూర్ణ స్టూడియోలో సినిమాలు షూట్ చేస్తే గర్వంగా ఫీలై పెద్ద పోస్టర్స్ పెడతాం. అలా `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలకు పోస్టర్లు పెట్టాం. ఇప్పుడు `విక్రాంత్ రోణ`కి పెట్టబోతున్నట్టు తెలిపారు నాగార్జున. తెలుగు ఆడియెన్స్ సినిమా లవర్స్. వారిది మంచి మనసు. ఎందుకంటే మా వాళ్లకు సినిమా నచ్చిందంటే తీసుకెళ్లి అక్కడో ఆకాశంలో పెడతారు. `విక్రాంత్` సినిమాకి అలాంటి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నా` అని చెప్పారు.
హీరో కిచ్చా సుదీప్ చెబుతూ, తాను టీవీలో చూసిన తొలి తెలుగు సినిమా `రాముడు భీముడు`, ఆ తర్వాత థియేటర్లో చూసిన తొలి చిత్రం `శివ` అని చెప్పారు. తనకు భాష రాకపోయినా రెండు రోజుల్లో మూడు సార్లు చూశానని వెల్లడించారు సుదీప్. సైకిల్ చైన్తో మరొకరిని కొట్టొచ్చు అనే విషయం అప్పటి వరకు నాకు తెలియదు. అప్పటినుంచి దాన్నొక స్టయిల్గా వాడుకున్నాం. అప్పట్లో బ్యాగ్లో సైకిల్ చైన్ పెట్టుకుని తిరిగే వాళ్లం అని చెప్పారు. అలాంటి నాగ్ సర్తో ఇప్పుడు స్టేజ్ని పంచుకోవడం ఆనందంగా ఉందని, ఒక్క ఫోన్ కాల్తో ఆయన వచ్చేందుకు రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
`విక్రాంత్ రోణ` సినిమాకు హైదరాబాద్తో మంచి అనుబంధం ఉందని, 60-70 శాతం సినిమా షూటింగ్ను హైదరాబాద్లోనే చిత్రీకరించామని, అందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించామన్నారు. ఐదారు వందల మంది అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్లో ఉన్నాం. మూడు నెలలు అక్కడ షూటింగ్ చేసినా ఒక కరోనా కేస్ కూడా రాలేదని పేర్కొన్నారు సుదీప్.. ఆర్ట్ డైరెక్టర్ శిబు లేకుండా ఉండుంటే అనూప్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుండలేడు. అలాగే అజనీష్ తన మ్యూజిక్తో సినిమాను పది మెట్లు పైకి తీసుకెళ్లాడని, `విక్రాంత్ రోణ` చిత్రంతో వన్ ఆఫ్ ది బెస్ట్ 3డీ ఎక్స్పీరియెన్స్ ఫీల్ అవుతారని ప్రామిస్ చేస్తున్నాడని చెప్పారు సుదీప్.
చిత్ర దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ, మొదట నాగార్జునని ఉద్దేశించి `గీతాంజలి` సినిమాలోని పాట పాడి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన చెబుతూ, ‘విక్రాంత్ రోణ` తన ఇరవై ఏళ్ల కల అని, సుదీప్గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా ఫస్ట్ స్క్రిప్ట్ సుదీప్గారి కోసమే రాసుకున్నానని చెప్పారు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉందని, `గీతాంజలి` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసినట్టు చెప్పారు. ఇందులో జానీ మాస్టర్, రామజోగయ్య శాస్త్రి, విజయ్ మాస్టర్, నిర్మాత నిరూప్ భండారి పాల్గొన్నారు.
