Asianet News TeluguAsianet News Telugu

మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజాపై విరుచుకుపడ్డ ప్రముఖ నిర్మాత

ఎల్‌.వి.ప్రసాద్‌ ఫ్యామిలీ త‌ర‌త‌రాలుగా సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడున్న ప్ర‌సాద్ థియేట‌ర్స్ స్థానంలో కొత్త థియేట‌ర్‌ను క‌ట్టాల‌నే వారు ఆలోచిస్తున్నారు. ఇళ‌య‌రాజా వంటి లెజెండ్ ఇలాంటి ప‌నులు చేయ‌డం త‌గ‌దు. ఆయ‌న ఎందుకు ఈ ప‌ని చేశారు? ఎవ‌రి మాట విని చేశారు? అని తెలియ‌డం లేదు.

katragadda prasad harsh criticism of ilayaraja
Author
Hyderabad, First Published Aug 3, 2020, 9:56 PM IST

ఇళయరాజాపై ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ ఘాటు విమర్శలు చేశారు. ఓ ఉన్నత స్థానంలో ఉన్న ఇళయరాజా ఇంతటి స్థాయికి దిగజారడం బాధాకరమని అన్నారు. మ్యూజికల్‌ మేస్ట్రో ఇళ‌య‌రాజా.. ప్ర‌సాద్ ల్యాబ్స్ తనది అని, దాన్నుంచి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ స్పందించారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

`ఎల్వీ ప్రసాద్‌ 1950లో కోడంబాకం ఏరియాలో పాతిక ఎక‌రాల భూమిని కొని ప్ర‌సాద్ ల్యాబ్స్‌ను నిర్మించారు. జనం వెళ్లేందుకు బయపడే ఆ ప్రాంతంలో ఎల్వీ ప్రసాద్‌, ఎ.వి.మెయ్యప్పన్‌, నాగిరెడ్డి, చ‌క్ర‌పాణి వంటి వారు ఎన్నో కష్టాలు పడి స్టూడియోలు క‌ట్టారు. ఈ మూడు స్టూడియోలు సినీ ఇండ‌స్ట్రీకి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఈ మూడు స్టూడియోల్లోనే నాలుగు రాష్ట్రాల‌కు చెందిన సినిమా షూటింగ్స్ జ‌రిగేవి. అలాంటి చ‌రిత్ర ఉన్న ప్ర‌సాద్ స్టూడియోలో ఇళ‌య‌రాజా థియేట‌ర్ నాదంటూ, స్థ‌లం నాదంటూ కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం, కోర్టు కెళ్ల‌డం బాధాక‌రం. ఇలా చేయ‌డం ఇవాళ ఆయ‌న ఉన్న స్థాయికి త‌గ‌ద‌ని నేను భావిస్తున్నాను` అని అన్నారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ, `ఆ రోజుల్లో ఇళ‌యరాజా, దేవా, చక్రవర్తి అగ్ర సంగీత దర్శకులుగా రాణించారు. వారికి రికార్డింగ్ థియేట‌ర్స్ కావాలంటే ఇబ్బందులు వ‌స్తాయేమోన‌ని ఎల్‌.వి.ప్ర‌సాద్‌.. ఇళ‌య‌రాజా కోసం ప్ర‌సాద్ డీల‌క్స్ థియేట‌ర్‌ను డెవ‌లప్ చేసి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ సిద్ధం చేసి ఆయ‌న రికార్డింగుల‌కు అనుకూలంగా చేసి ఇచ్చారు. ఇళ‌య‌రాజా ఇప్పుడు ప్ర‌సాద్ ల్యాబ్స్ స్థ‌లం నాదంటూ కోర్టు కెక్క‌డం త‌గదు. అప్ప‌ట్లో ఇళ‌య‌రాజా చేసే రికార్డింగుల‌కు ఆయ‌న ప‌నిచేసే నిర్మాత‌లే ప్ర‌సాద్ ల్యాబ్స్‌కు డ‌బ్బులు క‌ట్టేవారు. అటు ప్ర‌సాద్ ల్యాబ్స్ యాజ‌మాన్యానికి కానీ.. ఎలాంటి డీలింగ్స్ లేవు. ఆయ‌న త‌న థియేట‌ర్‌ను కూల‌గొట్టార‌ని వార్తల్లోకి ఎక్కారు. 

ఈ స‌మ‌స్య ప్రారంభం రోజునే ఇన్‌వాయిస్ చూపించి త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను ఇళ‌య‌రాజా తీసుకెళ్లిపోయారు. ఎల్‌.వి.ప్రసాద్‌ ఫ్యామిలీ త‌ర‌త‌రాలుగా సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడున్న ప్ర‌సాద్ థియేట‌ర్స్ స్థానంలో కొత్త థియేట‌ర్‌ను క‌ట్టాల‌నే వారు ఆలోచిస్తున్నారు. ఇళ‌య‌రాజా వంటి లెజెండ్ ఇలాంటి ప‌నులు చేయ‌డం త‌గ‌దు. ఆయ‌న ఎందుకు ఈ ప‌ని చేశారు? ఎవ‌రి మాట విని చేశారు? అని తెలియ‌డం లేదు. ఇలాంటి ప‌నుల‌ను ఇండ‌స్ట్రీ ఎప్పుడూ హ‌ర్షించ‌దు. ఇప్ప‌టికైనా ఆయ‌న కోర్టు కేసుల‌ను విత్‌డ్రా తీసుకుంటే బాగుంటుంద`ని తెలిపారు. మరి దీనిపై ఇళయరాజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios