`ఆర్ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ మరో సినిమాని ప్రకటించారు. ఆయన నటిస్తున్న ఎనిమిదవ చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం.
`ఆర్ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్లో ఓవర్నైట్లో స్టార్ అయిపోయాడు కార్తికేయ గుమ్మికొండ. ఆ సినిమా తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా కార్తికేయకి ఆఫర్లు వచ్చి పడ్డాయి. `90ఎంఎల్`, `హిప్పి`, `గ్యాంగ్లీడర్`, `గుణ369`, `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` వంటి సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. నటుడిగా కార్తికేయ మెప్పించాడు. కానీ కమర్షియల్గా సక్సెస్ అందుకోలేకపోయాడు. `ఆర్ఎక్స్ 100` తర్వాత ఆయన నటించిన మరే సినిమా విజయాన్నివ్వలేదు. దీంతో ఇంకా అదే ట్యాగ్తో పిలుస్తున్నారు నెటిజన్లు.
ఇటీవల `వలిమై` చిత్రంలో విలన్గానూ నటించాడు. ఈ సినిమా తమిళంలో బాగానే వసూళ్లని రాబట్టింది. కానీ తెలుగులో సత్తాచాటలేకపోయింది. కార్తికేయ కెరీర్కి ప్లస్ కాలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు కార్తికేయ. ప్రభాస్ బ్యానర్లో చేస్తున్నారు. డార్లింగ్ హోం బ్యానర్గా చెప్పబడే `యూవీ క్రియేషన్స్`లో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ దర్శక నిర్మాతలు విడుదల చేశారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు సత్య జి ఎడిటర్. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. మరి ఈ చిత్రంతోనైనా కార్తికేయ సక్సెస్ కొట్టి `ఆర్ఎక్స్ 100` ట్యాగ్ నుంచి బయట పడతాడేమో చూడాలి. యూవీ క్రియేషన్స్ నుంచి ఇటీవల ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
నటీనటులు:
కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్
సాంకేతిక నిపుణులు -
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి
నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
