`కాంతార 2` అప్ డేట్.. అదిరిపోయే వార్త చెప్పిన నిర్మాణ సంస్థ..
కన్నడ నాట నుంచి వచ్చి సంచలనం సృష్టించిన సినిమా `కాంతార`. ఈ సినిమాకి సీక్వెల్ పార్ట్ 2 వస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఉగాది పండుగ సందర్భంగా అప్డేట్ ఇచ్చింది యూనిట్.
ఇండియన్ సినిమాలో `కాంతార` ఒక సంచలనం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రమిది. అసలు ఇలాంటి ఓ సినిమా వస్తుందనే విషయం తెలియకుండానే వచ్చి కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. కన్నడలో విడుదలై హిట్ అయిన పది రోజుల తర్వాత ఇతర భాషల్లో విడుదలై షాకింగ్ కలెక్షన్లని సాధించింది. ఈ సినిమా నాలుగువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టుకుంది. బడ్జెట్కి పది రెట్ల వసూళ్లు రాబట్టింది. మ్యాజికల్ హిట్తో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ చిత్రానికి కన్నడ దర్శక, నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఆయనే ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా సప్తమి గౌడ నటించారు. అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈ చిత్రం సాగుతుంది. చాలా రూట్ లెవల్లో తీసిన చిత్రమిది. చాలా నిజాయితీ ప్రయత్నం. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలోని ఎమోషన్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దీనికి సీక్వెల్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
`కాంతార2`ని తెరకెక్కించబోతున్నట్టు చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఆ మధ్య సీక్వెల్పై దర్శకుడు రిషబ్ శెట్టి వర్క్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. లొకేషన్స్ కూడా వెతుకుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. `కేజీఎఫ్2` చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ `కాంతార`ని కూడా నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలిపింది. ఈ మేరకు అభిమానులకు శుభవార్త చెప్పింది.
`మన కొత్త ఏడాది ఉగాది పండుగ సందర్భంగా `కాంతార` రెండో పార్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రకృతితో మన సంబంధాన్ని ప్రదర్శించే మరో ఆకర్షణీయమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేం ఆతృతగా ఉన్నాం. మరిన్ని అప్డేట్ ల కోసం వేచి ఉండండి` అని పేర్కొంది. దీంతో `కాంతార` లవర్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కించే వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.