నా కెరీర్ ముగిసిపోతే బాలీవుడ్ కే నష్టం, నాక్కాదు-కంగన
- బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కంగనా రనౌత్
- ఇటీవల హృతిక్ రోషన్ తో చెడిపోవడంతో రచ్చకెక్కిన రాణి
- ప్రస్థుతం క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక(రాణి రుద్రమ) సినిమాలో నటిస్తున్న కంగన
మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నట్టే ఉండి ఒక్క సారి పాత పగలని తిరగ దోడింది మిస్ కాంట్రవర్సీ ఆఫ్ బాలీవుడ్ కంగనా రనౌత్. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి పై ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్లపై తనకున్న వైరం గురించి ప్రస్తావించింది. ఆదిత్య పంచోలి తనను చిన్నప్పుడు దారుణం కొట్టేవాడని కంగనా కామెంట్స్ చేసింది. దీనిపై పంచోలి ఆమెపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.
అది అక్కడితో ఆగిపోలేదు కంగనా వ్యాఖ్యలకు రిటార్ట్ ఇస్తున్నా అంటూ సింగర్ సోనా మహాపాత్రో.. కంగనా తన కొత్త సినిమా "సిమ్రన్" కి ప్రచారం కోసమే ఇలా సంచలన ప్రకటనలతో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందంటూ.. ఒక బహిరంగలేఖ రాసింది, ఆ లేఖకు కంగనా చెల్లెలు రంగోలీ మళ్ళీ తన ట్వీట్లతో సమాధానం ఇచ్చింది. ఘాటుగా స్పందించింది. "ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు దాన్ని సర్కస్ అంటూ వ్యాఖ్యానించకు. మనుషుల జీవితాలు వారి ప్రయాణాలు, సినిమాలపై ఆధారపడి ఉండవు. నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి. నీలాంటి వాళ్లు పబ్లిసిటీ కోసం ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారు' అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ బాలీవుడ్ లో దుమారం రేపారు. అసలు ఎవరిని ఎవరు తిడుతున్నారో అర్థం కాక.. వీళ్ల వ్యవహారశైలిపై బాలీవుడ్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే కంగనా మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించింది. కెరీర్ ముగిసిపోవడంపై తనకు ఎలాంటి బెంగ లేదని, దాని గురించి భయపడితే, జీవితమంతా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కంగనా చెప్పుకొచ్చింది. `పదిహేనేళ్ల వయసులో నేను ఒంటరిగా సినిమా అవకాశాల కోసం వచ్చాను. ఇప్పుడు బాలీవుడ్ లో నేనో మెగాస్టార్ ని ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో గొప్ప సినిమాల్లో నటించి, మూడు జాతీయ అవార్డులు సాధించిన నాకు ఇంతకంటే ఏం కావాలి? కెరీర్ ఆగిపోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు.
ఒకవేళ ఆగిపోయినా నేను వేరే రంగాల్లో రాణించగలననే నమ్మకం నాకు ఉంది` అని చెప్పింది. ఆ సత్తా తనకు ఉందని తాను మనాలీలో ఓ అందమైన ఇల్లు కట్టుకున్నానని, రచయితగా గానీ, దర్శకురాలిగా గానీ నిలదొక్కుకునే సత్తా తనకు ఉందని కంగనా చెప్పింది. అంతేకాకుండా బాలీవుడ్ తనకు ఏమీ ఇవ్వలేదని, తానే బాలీవుడ్కు ఇచ్చానని, తన కెరీర్ ముగిసిపోవడం వల్ల బాలీవుడ్కే నష్టమని గట్టిగానే మాట్లాడింది.