కాజోల్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. తాజాగా ఆమె రెండు ఫ్లాట్లు కొనడం విశేషం. జుహులోని అనన్య భవనంలో రెండు అపార్ట్మెంట్లని కాజోల్‌ కొనుగోలు చేసిందని, ఈ రెండు ఫ్లాట్లు పదవ అంతస్తులో ఉన్నాయని తెలుస్తుంది.

బాలీవుడ్‌ నటి కాజోల్‌ నటిగానే సినిమాలు తగ్గించింది. కానీ రియల్‌ ఎస్టేట్‌లో భారీగానే ఇన్వెస్ట్ చేస్తుంది. ఇటీవల తనభర్తతో కలిసి ఓ భారీ ఇంటిని కొనుగోలు చేశారు. తాజాగా రెండు ఫ్లాట్లు కొన్నారు కాజోల్‌. ముంబయిలోని సెలబ్రిటీ ఏరియా అయిన జుహులో కొత్తగా రెండు ఫ్లాట్లు తీసుకుందట. జనవరిలోనే కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌ మీడియా తాజాగా ఈ కథనాలను వెల్లడించింది. 

జుహులోని అనన్య భవనంలో రెండు అపార్ట్మెంట్లని కాజోల్‌ కొనుగోలు చేసిందని, ఈ రెండు ఫ్లాట్లు పదవ అంతస్తులో ఉన్నాయని తెలుస్తుంది. అయితే వీటి కోసం కాజోల్‌ ఏకంగా రూ.12(11.95)కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఈ రెండు ఫ్లాట్లు రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. ప్రస్తుతం కాజోల్‌, అజయ్‌ దేవగన్‌ శివశక్తి బంగ్లాలో ఉంటున్నారు. దీన్ని ఇటీవల దాదాపు ఆరవై కోట్లు కొనుగోలు చేశారు. దీనికి సమీపంలోనే తాజా కొత్త అపార్ట్ మెంట్లు ఉంటాయని సమాచారం. కాజోల్‌ విశాల్‌ దేవగన్‌ పేరుతో ఈ కొత్త ఇండ్లని రిజిస్టర్‌ చేయించింది కాజోల్‌. 

ఇక నటిగా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది కాజోల్‌. ఆమె చివరగా `త్రిభంగః తేది మేధి క్రేజీ` చిత్రంలో కనిపించింది. దీన్ని రేణుకా షహానే రూపొందించారు. కాజోల్‌తోపాటు తన్వీ అజ్మీ, మిథిలా పాల్కర్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరిలో ఓటీటీలో విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం కాజోల్‌ `సలామ్‌ వెంకీ` చిత్రంలో నటిస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజోల్‌ 2010 వరకు ఫుల్‌ బిజీ హీరోయిన్‌గా రాణించింది. పిల్లలు పెద్దవుతున్న నేపథ్యంలో కీలక పాత్రలకు పరిమితమవుతుంది. ఆ మధ్య `వీఐపీ 2`తో తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిన విషయం తెలిసిందే. 

కాజోల్‌ బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా నిలిచింది. `దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే` చిత్రంతో బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్ గా మారింది. షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జోడికి క్రేజ్‌ ఉంది. ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ కపుల్‌గా నిలిచింది. అజయ్‌ దేవగన్‌ని మ్యారేజ్‌ చేసుకున్నాక క్రమంగా సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుతం కాజోల్‌, అజయ్‌ జంటకి కూతురు నైసా, కుమారుడు యుగ్‌ ఉన్నారు. అజయ్‌ దేవగన్‌ హీరోగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.