పైరసీపై ఉక్కుపాదం మోపేందుకు జియో స్టార్ రంగంలోకి దిగింది. డిజిటల్ పైరసీకి సంబంధించిన తాజాగా అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో ఓ అక్రమ టీవీ నెట్ వర్క్ ని మూసేయడంలో కీలక పాత్ర పోషించింది.
పైరసీపై పోలీసులు ఉక్కుపాదం
పైరసీ అనేది ఎంటర్టైన్మెంట్ రంగంలో పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా సినిమాలకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇప్పటికే ఈ పైరసీపై తెలంగాణ పోలీసులు కొంత వరకు విజయం సాధించింది. మూవీ రూల్స్ వంటి కొన్ని పైరసీ సంస్థల వెనుక ఉన్న వారిని పట్టుకున్నారు. త్వరలో ఐ బొమ్మ టీమ్ని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు డిజిటల్ పైరసీ ఆటలు కట్టడి చేసేందుకు జియో స్టార్ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో పైరసీ సూత్రదారులను పట్టుకున్నారు. ఇందులో జియో స్టార్ టీమ్ కీలక పాత్ర పోషించడం విశేషం.
అన్నమయ్య జిల్లాలో డిజిటల్ పైరసీని పట్టుకున్న జియో స్టార్
మన భారతదేశంలో డిజిటల్ పైరసీపై గత కొన్ని రోజులుగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు జియోస్టార్ (JioStar) తాజా విజయం చాటి చెబుతుంది. ప్రపంచ ప్రీమియం కంటెంట్(వివిధ చానెల్స్ )ని రోలెక్స్ టీవీ అనే అక్రమ ఐపిటివి(Internet Protocol Television) అప్లికేషన్ ద్వారా ప్రసారం చేస్తుంది. జియో స్టార్ టీమ్ చేపట్టిన చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఈ పైరసీ సూత్రదారులను పోలీసులు పట్టుకున్నారు. జియోస్టార్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గ్రోత్ బృందం ఈ అక్రమ నెట్వర్క్లపై ప్లాన్ చేసి ఎక్కడ ఏ విధంగా పైరసీ జరుగుతుందో గమనిస్తూ, సంబంధిత అధికారులకు సమగ్ర నివేదిక అందించింది. వారి ఆధారంగా వెంటనే చర్య తీసుకొని రోలెక్స్ టీవీ ఐపిటివి సర్వీసును పూర్తిగా నిలిపివేశారు.
పదివేల చానెల్స్ ని అక్రమంగా ప్రసారం చేసిన రోలెక్స్ టీవీ
పోలీసుల విచారణలో.. రోలెక్స్ టీవీ 10,000 కంటే ఎక్కువ లినియార్ చానెల్స్(linear channels)ని అక్రమంగా ప్రసారం చేస్తున్నట్లు తేలింది. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్డిమాండ్ కంటెంట్ను కూడా IP హక్కులు మించిపోయి చెలామణీ చేస్తున్నారు. టెలిగ్రామ్ (Telegram), ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి యువతను ఉద్యోగ అవకాశాల పేరుతో ఆశచూపి వారిచేత ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో చిన్నపిల్లలు కూడా భాగస్వామ్యం కావడం షాకిస్తుంది. దీనివల్ల సోషల్, నైతిక ప్రమాదాలు కూడా కలుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
రూ.700కోట్ల నష్టాన్ని నివారించిన జియో స్టార్
తాజాగా రోలెక్స్ టీవీపై చర్యలు తీసుకున్న పోలీసులు, ఈ టీవీ సర్వీస్ని పూర్తిగా క్లోజ్ చేసినట్టు తెలిపారు. ఇది అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్స్పై భారత సరిహద్దు పరిధిలో తీసుకున్న బలమైన చర్యగా పరిగణించాలని తెలిపారు. జియోస్టార్ సంస్థ సాధించిన విజయం ఇదొక్కటే కాదు ఈ సంవత్సరం ప్రారంభంలో గుజరాత్ సైబర్ పోలీసుల సహకారంతో బిఒఎస్ IPTV నెట్వర్క్ను భగ్నం చేసి, దాదాపు ₹700 కోట్ల నష్టాన్ని నివారించారు. జియోస్టార్ సంస్థ తమ ఆధారాల ఆధారంగా, చట్టానికి సంబంధించి ప్రజల మధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మన దేశంలో డిజిటల్ భద్రతను కాపాడేందుకు ఇది ఎంతో కృషి చేస్తుండటం విశేషం.
