ఏపీ సీఏం వైఎస్ జ‌గ‌న్ జీవితం ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన పొలిటికల్‌ చిత్రం యాత్ర2.

ఏపీ సీఏం వైఎస్ జ‌గ‌న్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం యాత్ర 2. క్రిందటి నెలలో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ న‌టుడు జీవా న‌టించిన ఈ సినిమాలో మ‌మ్ముట్టి గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. 2019లో రిలీజైన యాత్ర‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఆంధ్రాలో ఓ మోస్తరు గా ఆడిన ఈచిత్రం తెలంగాణాలో అసలు వర్కవుట్ కాలేదు. అయితే ఇది ఎలక్షన్ చిత్రమే కాబట్టి వారి టార్గెట్ కూడా అదే కాబట్టి ఇబ్బందిగానూ అనిపించలేదు. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. 

అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ పొలిటికల్‌ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం యాత్ర 2 మేకర్స్, ఓటీటీ సంస్థ మధ్య డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నెలరోజుల తర్వాత అంటే మార్చి రెండో వారంలో యాత్ర 2 సినిమా ఓటీటీలో రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని వార్తలు వస్తున్నాయి.

స్టోరీ లైన్

రెండో సారి ముఖ్యమంత్రి అయిన వైయస్సార్ (మమ్ముట్టి) తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి (జీవా)ని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పరిచయం చేస్తారు. అనుకోని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణిస్తారు. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు. కానీ ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్, మేడమ్ (సుజానే బెర్నెర్ట్) రోశయ్యను సిఎం చేస్తారు. ఈ లోగా తన తండ్రి మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను నిర్ణయించుకుంటాడు జగన్. వాళ్లను కలవడానికి ఓదార్పు యాత్ర చేపడతారు . ఆ యాత్ర చేస్తే రాజకీయంగా ఇబ్బంది అని ఆపేయమని మేడమ్ నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని లెక్కచేయకుండా జగన్... తాను రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని, యాత్ర చేస్తానని చెప్పి ముందుకు వెళ్తారు. అంతే కాదు ప్రోగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థాపిస్తారు. ఇదిలా ఉంటే తెలుగునాడు పార్టీ అధినేత చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) నుంచి జగన్ పార్టీకి సమస్యలు ఎదురౌతాయి..అవేమిటి,చివరికి ఏమైంది? అనేది మీకు తెలియకపోతే సినిమా చూసి తెలుసుకోవాలి.

త్రీ ఆటమ్న్ లీవ్స్ నిర్మించిన యాత్ర 2 సినిమాలో కేతకి నారాయణ్‌, మహేశ్ మంజ్రేకర్, సుజానే బెర్నెట్‌, శుభలేఖ సుధాకర్‌, జార్జ్ మరియన్, రాజీవ్ కుమార్ అనేజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. మధి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.