శివ, యానిమల్ లాంటి సినిమాలు చూస్తే.. నాకే ఎదుటవాడిని చంపేయాలనే భావన కలుగుతుంది. చిన్న పిల్లల్లో ఆ సినిమాలు...
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సూపర్ హిట్స్ తర్వాత సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్ (Animal) . ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది. యానిమల్ కలెక్షన్లు 12 రోజుల్లో కేవలం ఇండియాలోనే రూ.458.12 కోట్లకు చేరాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా రూ.450 కోట్ల మార్క్ దాటిన సినిమాగా పఠాన్, గదర్ 2 మూవీల రికార్డులను కూడా యానిమల్ బ్రేక్ చేసింది. షారుక్ ఖాన్ పఠాన్ 18 రోజుల్లో, సన్నీ డియోల్ గదర్ 2.. 17 రోజుల్లో ఈ మార్క్ దాటాయి.
ఇక ఈ చిత్రం హిందీతోపాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైనా తమిళం, కన్నడ,మలయాళంలలో యానిమల్ కు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. ప్రేక్షకులు మాత్రం తెగ చూస్తూనే ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలో ఈ మూవీ గురించి రాజకీయనాయకుడు, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ మాట్లాడారు.
జయ ప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. “సినిమాల వల్ల మనుషులు మారిపోరు, చెడిపోరు. కానీ వారి ఆలోచన విధానం పై మాత్రం ప్రభావితం చూపుతాయి. సినిమా మేకర్స్ కి కూడా సమాజం పట్ల భాద్యత ఉండాలి. మంచి ఆలోచనలు కలిగేలా చేయకపోయినా పర్వాలేదు. చెడు ఆలోచనలు కలిగేలా సినిమాలు తెరకెక్కించకుండా ఉంటే బాగుటుంది” అని పేర్కొన్నారు.
అలాగే “సమాజంలో జరిగే తప్పులకు పూర్తి భాద్యత సినిమాలు అనడం లేదు. అలా అనడం కూడా తప్పు. కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం సమాజం పై భాద్యత వహించి సినిమాలు తీస్తే బాగుటుంది. శివ, యానిమల్ లాంటి సినిమాలు చూస్తే.. నాకే ఎదుటవాడిని చంపేయాలనే భావన కలుగుతుంది. చిన్న పిల్లల్లో ఆ సినిమాలు మరింత ప్రభావం చూపిస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కించాలి” అని చెప్పుకొచ్చారు.
