జనగణమన నుండి ప్రొడ్యూసర్ అవుట్? ఆ ఒక్కదారి కూడా మూసుకుపోతే!
పూరి జగన్నాధ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఒక ప్రక్క లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒత్తిడి ఎదుర్కొంటున్న పూరి జగన్నాధ్ కి జనగణమన విషయంలో ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి.
లైగర్ విడుదలకు ముందే పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన ప్రకటన, ప్రీ ప్రొడక్షన్, ఫస్ట్ షెడ్యూల్ మొదలైపోయాయి. జనగణమన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసినట్లు లైగర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో స్వయంగా పూరి వెల్లడించారు. కాగా లైగర్ ఫలితం చూశాక కంగుతిన్న జనగణమన నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతుంది. మై హోమ్ గ్రూప్ జనగణమన నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంస్థ ప్రీ ప్రొడక్షన్ కి, జరిగిన షూటింగ్ కి కలిపి రూ. 20 కోట్లు వరకూ ఖర్చు చేశారట.
జనగణమన భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా చాలా ఖర్చయ్యే అవకాశం కలదు. లైగర్ వసూళ్లు చూశాక జనగణమన పై అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సరికాదని నిర్మాతల ఆలోచనట. మై హోమ్ గ్రూప్ జనగణమన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు పూరితో నేరుగా చెప్పేశారట. దీంతో ప్రాజెక్ట్ పరిస్థితి అయోమయంలో పడింది అంటున్నారు. మరో నిర్మాత దొరికితేనే జనగణమన మూవీ కంప్లీట్ అవుతుంది. లేదంటే ఇక్కడితో ఆగిపోతుంది.
జనగణమన ను అడ్డుపెట్టుకొని పూరి లైగర్ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలని చూస్తున్నారు. లైగర్ తో నష్టపోయిన వారికి జనగణమన తక్కువ ధరకు ఇస్తానని హామీ ఇస్తున్నట్లు సమాచారం. కావున జనగణమన ఆగిపోతే పూరి కోలుకోలేని దెబ్బతింటారు. అటు విజయ్ దేవరకొండ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. లైగర్ తో సర్వం కోల్పోయిన పూరి, ఛార్మి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో పూరి జనగణమన తెరకెక్కిస్తున్నారు. గతంలో మహేష్, పవన్ వంటి స్టార్స్ తో ఈ మూవీ చేయాలనుకున్నాడు. పూరి డ్రీం ప్రాజెక్ట్ గా ఉన్న జనగణమన లైగర్ ఫెయిల్యూర్ కారణంగా కష్టాల్లో పడింది.