'మహర్షి' ఈవెంట్స్ కి జగపతి బాబు డుమ్మా.. కారణమదేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలైన మంచి సక్సెస్ ని అందుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలైన మంచి సక్సెస్ ని అందుకుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేశారు. మహేష్ బాబు స్వయంగా థియేటర్లకు వెళ్లడం, స్పెషల్ ఇంటర్వ్యూల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది.
సక్సెస్ మీట్, పార్టీలు, థియేటర్ విజిట్స్, రైతులతో ముచ్చట్లు ఇలా ఒకటా రెండా అన్నింటికీ కూడా మహేష్ తప్పక హాజరవుతున్నాడు. మహేష్ తో పాటు యూనిట్ మెంబర్స్ కూడా వెళ్తున్నారు. తాజాగా విజయవాడలో మహర్షి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ వేడుకకు యూనిట్ మొత్తం హాజరైంది కానీ జగపతి బాబు మాత్రం కనిపించలేదు.
సినిమా విడుదలైన తరువాత ఏ ఒక్క ఈవెంట్ లో కూడా జగపతిబాబు కనిపించలేదు. 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్-జగపతిల కాంబో బాగా క్లిక్ అయింది. ఆ కారణంగానే మరోసారి ఆ కాంబో రిపీట్ చేశారు. ఈ సినిమాలో జగపతి విలన్ గా కనిపించారు.
అయితే సినిమాలో ఆయన పాత్రలో కొత్తదనం లేకపోవడం, పాత్రని హైలైట్ చేసి చూపించకపోవడంతో జగపతిబాబుకి దర్శకుడు వంశీ పైడిపల్లికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని ఆ కారణంగానే జగపతి బాబు ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతున్నారని అంటున్నారు. అయితే యూనిట్ మాత్రం అందులో నిజం లేదని.. జగపతిబాబు షూటింగ్ లతో బిజీగా ఉండడం వలన ప్రమోషన్స్ కి రావడం లేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.