హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ ప్రకటన
తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రమోషన్లో భాగంగా హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. తాను ఇక ఇకపై సినిమాలు చేయనంటూ షాకిచ్చారు.
కోలీవుడ్ యంగ్ హీరో ఉదయ నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా కెరీర్కి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను సినిమాలు చేయబోనంటూ ప్రకటించారు. తాను పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని వెల్లడించారు. తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఈ ప్రకటన చేసి అందరిని షాక్కి గురి చేశారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ `నెంజుకు నిధి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
అందులో భాగంగా సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు ఉదయనిధి స్టాలిన్. ఇందులో ఆయన ఇకపై తాను సినిమాలు చేయబోనని (Udhayanidhi Stalin Quit from Movies) వెల్లడించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉందని, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. సినిమాల్లో నటించడం వల్ల ప్రజా సేవపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నట్టు తెలిపారు. అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన తదుపరి సినిమా `మామన్నన్` తర్వాత ఇక సినిమాల్లో నటించనని తెలిపారు ఉదయనిధి. `మామన్నన్` తన చివరి చిత్రం కాబోతుందన్నారు.
`ఓకే ఓకే` చిత్రంతో నటుడిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. ఫస్ట్ మూవీతోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ కోలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన తమిళనాడులో జరిగిన సాధారణ ఎన్నికల్లో డీఎంకే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడే ఉదయనిధి స్టాలిన్ కావడం విశేషం. ఇక ప్రస్తుతం ఆయన నటించిన `నెంజుకు నిధి` బాలీవుడ్లో విజయం సాధించిన `ఆర్టికల్ 15`కి రీమేక్గా తెరకెక్కింది.