దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటీటీలో అడల్ట్ కంటెంట్ కి ఆద్యుడు రామ్ గోపాల్ వర్మే అంటూ విమర్శించారు.  

ఓటీటీ కంటెంట్ హద్దులు దాటేస్తున్న తరుణంలో ప్రభుత్వాలతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన శృంగారం, హింసతో కూడిన సినిమాలు, సిరీస్లు యువత మీద దుష్ప్రభావం చూపవచ్చు. ఓటీటీకి కూడా సెన్సార్ అవసరం ఎంతైనా ఉందన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. రానా నాయుడు సిరీస్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బాధ్యుడిని చేస్తూ మాట్లాడారు. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ని ఓటీటీ కంటెంట్ లో చోటు చేసుకుంటున్న అస్లీలత గురించి అడగ్గా... ఇదంతా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వలనే అన్నారు. ఇది మొదలు పెట్టింది రామ్ గోపాల్ వర్మే. ఓటీటీలో చెత్త కంటెంట్ రావడానికి కారణం ఆయనే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రామ్ గోపాల్ వర్మ అడల్ట్ కంటెంట్ సినిమాలు తెరకెక్కించి ఓటీటీలో విడుదల చేశారు. జనాలు మెల్లగా ఆ తరహా కంటెంట్ కి అలవాటు పడ్డారు. నేను మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నాను. ఎన్నడూ అస్లీల చిత్రాల్లో నటించలేదు. సాంకేతికత పెరిగిపోతున్న రోజుల్లో ప్రతి పిల్లాడి చేతిలో మొబైల్ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి కంటెంట్ చూస్తే చాలా ప్రమాదం. కాబట్టి ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలని నొక్కి చెప్పారు. 

రామ్ గోపాల్ వర్మ మీద సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కీసీ కా భాయ్ కిసీ కీ జాన్ విడుదలకు సిద్ధమైంది. రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ కీలక రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఓ సాంగ్ లో క్యామియో అప్పరెన్సు ఇవ్వనున్నారు.