హీరో రణ్వీర్ సింగ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యూడ్ ఫోటో షూట్ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణలో రణ్వీర్ నగ్నంగా ఫోటో షూట్ చేయలేదని చెప్పినట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. ఒంటిపై నూలు పోగు లేకుండా రణ్వీర్ కెమెరా ముందుకు వచ్చారు. పేపర్ మ్యాగజైన్ కోసం రణ్వీర్ ఇలా నగ్నంగా మారడం జరిగింది. తన నగ్న ఫోటోలను రణ్వీర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో రణ్వీర్ నగ్న చిత్రాలు వైరల్ అయ్యాయి. రణ్వీర్ చర్యను సాంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.
దేశవ్యాప్తంగా రణ్వీర్ నగ్న ఫోటో షూట్ కి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులో రణ్వీర్ సింగ్ ముంబై పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణలో రణ్వీర్ నగ్నంగా ఫోటో షూట్ చేయలేదని చెప్పినట్లు సమాచారం. తన ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. నేను బట్టలు లేకుండా ఫోటోలు దిగలేదని రణ్వీర్ వెల్లడించాడట. పేపర్ మ్యాగజైన్ లోగోతో కూడిన నగ్న ఫోటోలు జులై 22న రణ్వీర్ అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.
మరి ఇప్పుడు ఆ ఫోటోలు మార్ఫింగ్ అని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ హీరోగా సర్కస్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. రోహిత్ శెట్టి దర్శకుడు కాగా పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని టైటిల్ తో మరో చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
