ఆ విషయంలో ఇకపై తలదూర్చనంటున్న ఇస్మార్ట్ శంకర్..!
ఇస్మార్ శంకర్ తో ఫార్మ్ లోకి వచ్చిన రామ్ అనవసరంగా ఓ పొలిటిక్ ఇష్యూపై ట్వీట్ చేసి ఇబ్బందుల్లోకి వెళ్లారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముద్దాయిగా ఉన్న రమేష్ చౌదరిని ఆయన వెనకేసుకు రావడం నెటిజన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఐతే ఈ విషయంపై రామ్ లేటెస్ట్ ట్వీట్ ఆసక్తి రేపుతోంది.
పొలిటికల్ విషయాలపై హీరోలు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోతేనే బెటర్. అందులోనూ ఒక వ్యక్తి పక్కన వకాల్తా పుచ్చుకోవడం మరీ ఇబ్బందికర అంశం. సదరు హీరో సపోర్ట్ చేసే వ్యక్తి తన బంధువై ఉన్నప్పుడు విమర్శల దాడి ఓ రేంజ్ లో ఉంటుంది. యంగ్ హీరో రామ్ విషయంలో ఇప్పుడు అదే అయ్యింది. కొద్దిరోజుల క్రితం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ జరిగిన అగ్నిప్రమాదం వలన కొందరు కోవిడ్ రోగులు మరణించారు. రమేష్ హాస్పిటల్స్ అధినేత రమేష్ చౌదరి ఆ హోటల్ ని కోవిడ్ సెంటర్ గా నిర్వహిస్తున్నారు. సరైన భద్రతా నియమాలు, అనుమతులు లేకుండా అక్కడ హాస్పిటల్ నిర్వహిస్తున్నారని పోలీసులు అతనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదుచేశారు.
ఈ ఘటనలో ముద్దాయిగా ఉన్న రమేష్ చౌదరి పరారీలో ఉన్నారు.
కాగా నిన్న ఈ ఘటనపై హీరో రామ్ ట్వీట్ చేశారు. ఆ సంఘటనలో రమేష్ చౌదరిది అసలు తప్పేం లేదని, ఆయనను కొందరు కావాలని ఇరికిస్తున్నారని అర్థం వచ్చేలా వరుస ట్వీట్స్ వేయడంతో పాటు, సంఘటనపై విశ్లేషణ ఇచ్చారు. దీనికి నెటిజెన్స్ నుండి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చనిపోయిన వారి గురించి కాకుండా రామ్ కేవలం తన బాబాయ్ రమేష్ చౌదరికి కొమ్ముకాయటం ఏమిటని తప్పుబట్టారు. అలాగే తప్పు చేయకపోతే ఆయన ఎందుకు పారిపోయారో చెప్పాలి అన్నారు.
పోలీసులు సైతం కేసు పూర్వాపరాలు తెలియకుండా కామెంట్స్ చేస్తే ఆయనకు నోటీసులు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనితో రామ్ నేడు ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ఇకపై ఈ విషయం గురించి నేను మాట్లాడాను అని, దుర్మార్గులు శిక్షించబడతారు అని ట్వీట్ చేశారు. అనవసరంగా సెన్సిటివ్ విషయంలోకి ఎంటర్ కావడం ఎందుకు, ఇలాంటి సంజాయిషీలు ఇచ్చుకోవడం ఎందుకు అని అందరూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.