#KVV:నాగశౌర్య పాదయాత్ర...ఫలితాన్ని ఇస్తుందా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలని శౌర్య ప్లాన్ చేసుకున్నాడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో తిరగనున్నట్లు పాదయాత్ర షెడ్యూల్ ను ఈరోజు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
రాజకీయాల్లో పాద యాత్రలు చూసాం. ఇప్పుడు ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లటం కోసం పాద యాత్ర జరుగుతోంది. ఆ సినిమానే 'కృష్ణ వ్రింద విహారి'. నాగశౌర్య కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే 'కృష్ణ వ్రింద విహారి'. సొంత బ్యానర్ 'ఐరా క్రియేషన్స్' పై నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా షిర్లే సెటియా పరిచయమవుతోంది. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. దాంతో ఏదో విధంగా బజ్ తెచ్చే ప్రయత్నం చేస్తోంది టీమ్.
— Ira Creations (@ira_creations) September 13, 2022
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నాగశౌర్య సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు. ప్రమోషనల్ టూర్లు , కాలేజీ విజిట్స్ వంటి రెగ్యులర్ పబ్లిసిటీ ఫార్మాట్ కు భిన్నంగా.. 'కృష్ణ వ్రింద విహారి' కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలని శౌర్య ప్లాన్ చేసుకున్నాడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో తిరగనున్నట్లు పాదయాత్ర షెడ్యూల్ ను ఈరోజు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
KVV టీమ్ సెప్టెంబర్ 14న తిరుపతి నగరంలో పాదయాత్ర చేయనుంది. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీన నెల్లూరు మరియు ఒంగోలు.. 16న విజయవాడ - గుంటూరు - ఏలూరులను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 17న భీమవరం - రాజమండ్రి.. 18న కాకినాడ - వైజాగ్ నగరాల్లో శర్వా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
మే 20వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్ తోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చారుగానీ, పరిస్థితులు అనుకూలించకపోవడం వలన విడుదల చేయలేదు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించింది. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. టైటిల్ ను బట్టి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం తెలుస్తోంది. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.