మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ సినిమా చుట్టూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. షూటింగ్‌, యాక్షన్‌ సీక్వెన్స్ కు సంబంధించిన రూమర్లు చాలా వినిపిస్తున్నాయి.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ వచ్చాయి. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం `గుంటూరు కారం`. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `అతడు`, `ఖలేజా` చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాని వరుస బెట్టి షూటింగ్‌ వాయిదాలు, షూటింగ్‌ క్యాన్సిల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికితోడు యాక్షన్‌ సీక్వెన్స్ విషయంలో మహేష్‌ సంతృప్తిగా లేరనే వార్త సైతం చాలా కాలంగా చక్కర్లు కొడుతుంది. మహేష్‌, త్రివిక్రమ్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ అంటూ వార్తలొస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి షూటింగ్‌కి సంబంధించి, అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌కి సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జూన్‌ చివరి వారంలో ప్రారంభం కావాల్సిన నెక్ట్స్ షెడ్యూల్‌ షూటింగ్‌ జులై మొదటి వారంలో ప్రారంభమవుతుందన్నారు. మరోవైపు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ని తప్పిస్తున్నారని, దేవి శ్రీ ప్రసాద్‌ని తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ నుంచి క్లారిటీ వచ్చింది. వాస్తవాలు ఏంటనేది వెల్లడించారు. 

`గుంటూరు కారం` నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ని తప్పించడం లేదని స్పష్టం చేశారు. ఆయన కొనసాగుతారని, ఆయన్ని తప్పుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు. మరోవైపు ఈ నెల 24 నుంచి నెక్ట్స్ షెడ్యూల్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. దానికి సంబంధించిన ముందస్తు వర్క్ జరుగుతుందని సమాచారం. అయితే రిలీజ్‌ డేట్‌ లో చిన్న మార్పు చోటు చేసుకునే అవకావం ఉందట. 

Scroll to load tweet…

మొదట సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే డేట్‌కి వస్తుందని తెలిపింది. ఒకవేళ `ప్రాజెక్ట్ కే` ఒక్క రోజు లేట్‌గా వస్తే అంటే జనవరి 12న రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమా జనవరి 13కి మారితే, `గుంటూరు కారం` జనవరి 12న రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ట్వీట్‌ చేయగా, దానికి నిర్మాత నాగవంశీ ఓకే చెబుతూ రియాక్ట్ కావడం విశేషం. దీంతో ఈ సినిమాకి సంబంధించిన చాలా అంశాలపై క్లారిటీ వచ్చినట్టయ్యింది. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి పూజా హెగ్డేని తప్పించే అవకాశాలున్నట్టు టాక్‌. దీనిపై స్పష్టత రావాల్సిఉంది.