నిర్మాతల మండలిపై మహేష్ బాబు బాబాయి, సీనియర్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్ బాబు బాబాయి.. సీనియర్ ప్రొడ్యూసర్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలిపై ఆయన ఫైర్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది...?
నిర్మాతల మండలిపై సీనియర్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్లో చేస్తున్న తీర్మానాలు వేరని, బయట జరుగుతున్న వాస్తవాలు వేరని ఆయన అన్నారు. గత రెండు రోజులగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు పరిశ్రమ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. చర్చల తరువాత నిన్న (మే 19) గురువారం ఫిల్మ్ ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆది శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన సీరియస్ అయ్యారు. ఆదిశేషగిరిరావ్ మాట్లాడుతూ.. కౌన్సిల్కు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా డివైడ్ అయిపోయింది. ఇక్కడ తీర్మానాలు వేరు బయట జరుగుతున్నవి వేరు. నిర్మాతల మండలి కొంతమంది చేతుల్లోకి వెళ్లింది. సినిమా టికెట్ ధరలు పెంచడం కరెక్ట్ కాదని నిర్మాత దిల్ రాజు ఎక్కడో చెప్పినట్లు విన్నాను. సినిమా ఏదైనా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ బిజినెస్ అని కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమా విడుదలయ్యాక మూడు రోజులు వ్యాపారం అంతే. సోమవారం నుంచి బిజినెస్ తగ్గిపోతుంది అన్నారు.
అంతే కాదు రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఫ్లెక్సిబుల్ రేట్లు అడిగి పర్మిషన్ తెచ్చుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అలా చేయకపోవడంతోనే ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తోంది అన్నారు ఆదిశేషగిరిరావు. అంతే కాదు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక వంద సమస్యలు మొదలయ్యాయని ఆయన కామెంట్ చేశారు. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందనీ, ఓటీటీపై కూడా కేంద్రం సెన్సార్ ఉండాలని ఆది శేషగిరిరావు అన్నారు. ఓటీటీలో సినిమా విడుదలైన సాయంత్రానికే పైరసీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మరికొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారాయన ఫిలిం ఛాంబర్, యాంటీ పైరసీ విభాగం ఇతరుల చేతుల్లో ఉందని.. డబ్బున్న వాళ్లకే యాంటీ పైరసీ సెల్ పనిచేస్తోంది. పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర జీరోగా మారిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యులు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి స్పందనలు వస్తాయో చూడాలి.