పవన్-హరీష్ శంకర్ మూవీ అప్డేట్ వచ్చేసింది... రీమేక్ అయితే వద్దు ఫ్యాన్స్ డిమాండ్!
ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో మూవీపై దర్శకుడు హరీష్ శంకర్ హింట్ ఇచ్చాడు. భవదీయుడు భగత్ సింగ్ అప్డేట్ వస్తుందన్నట్లు పరోక్షంగా తెలియజేశాడు. పవన్ కళ్యాణ్, మైత్రి మూవీ మేకర్స్, దేవిశ్రీలను ట్యాగ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ మూవీ ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతుంది. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి మరో ఏడాది గడచిపోయింది. అయినా పవన్-హరీష్ మూవీ పట్టాలెక్కలేదు. హరీష్ చిత్రం కంటే వెనుక ఒప్పుకున్న భీమ్లా నాయక్ పూర్తి చేసి విడుదల చేశారు. వినోదయ సిత్తం రీమేక్ కి పవన్ సైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రహస్యంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నట్లు సమాచారం. ఇవన్నీ చాలవన్నట్లు దర్శకుడు సుజీత్ తో ఇటీవల మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. మరోవైపు బస్సు యాత్ర కోసం వాహనం సిద్ధమైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నెలల సమయం మాత్రమే ఉంది. హరి హర వీరమల్లు షూట్ ఇంకా పూర్తి కాలేదు.
మొత్తంగా పవన్ సినిమాలపై పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు హరీష్ శంకర్ మూవీ ఉన్నట్లా? లేనట్లా? అనే సందేహాలు ఎప్పటి నుండో వేధిస్తున్నాయి. ఒక దశలో భవదీయుడు భగత్ సింగ్ డిలే అయ్యింది. హరీష్ మరో హీరోని వెతుక్కుంటున్నాడంటూ పుకార్లు వినిపించాయి. అసలు హరీష్ మూవీ పట్టాలెక్కక ముందే సుజీత్ చిత్రం ప్రకటించడమేంటనే సందేహాలు వెలువడ్డాయి.
అయితే పవన్ కళ్యాణ్ అందరికీ న్యాయం చేయదలుకున్నాడని తెలుస్తోంది. 2024 ఎన్నికలు సమీపించే లోపు సుజీత్, హరీష్ చిత్రాలు పవన్ పూర్తి చేయనున్నారని తెలుస్తుంది. హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర అప్డేట్ వస్తుందంటూ తెలియజేశాడు. తన ట్వీట్ లో పవన్ కళ్యాణ్, మైత్రి మూవీ మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ లను ట్యాగ్ చేశాడు. రాబోయే అప్డేట్ హరీష్ డైరెక్షన్ లో పవన్ మూవీ అనేది సుస్పష్టం. కాగా... ఇది తేరి రీమేక్ అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాకు రీమేక్స్ వద్దంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో సెట్టైన మూవీ భవదీయుడు భగత్ సింగ్ అని తెలిసి కూడా వారికి రీమేక్ అనే సందేహాలు ఎందుకు కలుగుతున్నాయో మరి. ఒక వేళ పవన్ భవదీయుడుని పక్కన పెట్టి మైత్రి ఇచ్చిన అడ్వాన్స్ కి తేరి రీమేక్ చేస్తున్నారేమో. స్ట్రెయిట్ చిత్రాలకు టైం పడుతుంది. రీమేక్ త్వరితగతిన పూర్తి చేయవచ్చు.