కమల్ హాసన్ నటించిన `విక్రమ్` సినిమా కలెక్షన్లు సునామీని చూసి యంగ్ హీరో అరుణ్ విజయ్ వెనక్కి తగ్గాడు. ఆయన నటించిన `ఏనుగు`(తెలుగు టైటిల్) చిత్ర విడుదల తేదీని మార్చారు.
లోక నాయకుడు తన విశ్వరూపం చూపించారు. ప్రయోగాలకు, కమర్షియాలిటీని జోడించి ఎన్నో బ్లాక్బస్టర్స్ అందుకున్న కమల్ హాసన్(Kamal Haasan) ఇటీవల కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. చాలా కాలంగా ఆయనకు సరైన హిట్ లేదు. అన్ని సోసోగా ఆడుతున్నాయి. చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఆయన చేసిన `విక్రమ్`(Vikram) సినిమా గత వారంలో విడుదలై సంచలన విజయం సాధించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్తోపాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా, సూర్య క్లైమాక్స్ లో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం(Vikram Collections) కురిపిస్తుంది. మొదటి రోజులు రూ. 56కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈచిత్రం ఇప్పుడు పది రోజుల్లో మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. అమెరికా, యూకే వంటి దేశాల్లో టాప్ గ్రాసర్గా నిలిచింది. తమిళంలో వంద కోట్లకుపైగా కలెక్ట్ చేయగా, తెలుగు రాష్టాల్లో రూ.25కోట్లు, కన్నడలో 15కోట్లు, మలయాలంలో ముప్పై కోట్లు వసూలు చేసి షాకిచ్చింది. ఇంకా ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతుంది. లాంగ్ రన్లో ఇంకా వంద కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ఈ చిత్రం తమిళనాట అత్యధిక కలెక్షన్లు రాబట్టిన `2,0`, `కబాలి`, `రోబో` చిత్రాల తర్వాత నాల్గో స్థానంలో నిలిచింది. త్వరలోనే పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్ల సరసన చేరబోతుందని చెప్పొచ్చు.
అయితే ఈ సినిమా కలెక్షన్లు సునామీని చూసి తమిళ యంగ్ హీరో అరుణ్ విజయ్ వెనక్కి తగ్గాడు. ఆయన నటించిన `ఏనుగు`(Enugu)(తెలుగు టైటిల్) చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. కమల్ హాసన్ చిత్రానికి గౌరవంగా తన సినిమాని వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 17న తెలుగు, తమిళంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ `విక్రమ్` బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డంకిగా మారడం సరికాదని తమ సినిమాని వాయిదా వేసినట్టు హీరో అరుణ్ విజయ్ తెలిపారు. ఈ చిత్రాన్ని జులై 1న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన తన టీమ్తోపాటు సోమవారం కమల్ హాసన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఇక శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్కుమార్, యోగి బాబు, నటీ నటులుగా, `సింగం` సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఏనుగు`. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది.
