OTT Film: కామెడీ ప్రధానంగా రూపొందుతున్న చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు అదే కోవలో ఈటీవీ విన్ నుంచి `ఈగో` అనే చిత్రం రాబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది.
ఝాన్సీ ప్రధాన పాత్రతో `ఈగో` మూవీ
ప్రస్తుతం కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుంది. సందర్భానుసారంగా పండే కామెడీ ఆడియెన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన `లిటిల్ హార్ట్స్`, `మ్యాడ్`, `డీజే టిల్లు` చిత్రాలు అలా అలరించినవే. సన్నివేశాలతో నవ్వులు పూయించి ఈ చిత్రాల మేకర్స్ హిట్లు కొట్టారు. చిన్న పాయింట్ల చుట్టూ ఫన్నీ ఎలిమెంట్లని రాసుకుని సక్సెస్ అయ్యారు. ఇటీవల వచ్చిన `ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో` కూడా ఈ జాబితాలోకి చేరుతుంది. ఇక ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. `ఈగో` పేరుతో ఓ సినిమా రూపొందింది. ఇది ఈటీవి విన్ మూవీ కావడం విశేషం.
ఆమెరికా వెళ్లేందుకు ఝాన్సీ ఇంగ్లీష్ కష్టాలు
తాజాగా `ఈగో` మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఝాన్సీ ప్రధాన పాత్రలో సారక్కగా నటించింది. ఆమె స్థానిక రౌడీగా కనిపించింది. ఆమెకి చదువు లేదు. లోక జ్ఞానం కూడా లేదు. అది ఎంతగా ఉంటే ఒక టీచర్(చరణ్) వచ్చి గాంధీ జయంతికి స్కూల్ ఫంక్షన్కి రావాలని పిలిస్తే ఐదో తారీఖు తర్వాత ఫంక్షన్ పెట్టుకోవాలని చెప్పేంత పూర్ కావడం విశేషం. దందాలు, మర్డర్లు, కిడ్నాప్లు చేసే రకం అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఆమెకి కావాల్సిన ఒకడు అమెరికాకి పారిపోతాడు. అతన్ని పట్టుకునేందుకు ఝాన్సీ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. వాడిని ఎలాగైనా పట్టుకుని రావాలని చెబుతుంది. అమెరికా ఎలా పోవాలంటే వీసా కావాలని టీచర్ చెబుతాడు. అది ఎట్ల వస్తదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెబుతాడు, ఇక ఇంగ్లీష్ నేర్పిస్తాడు. ఈ ఇంగ్లీష్ నేర్పించే క్రమంలో అతను పడే స్ట్రగుల్, అదే సమయంలో వాళ్లు చేసే కొంటె చేష్టల సమాహారమే ఈ చిత్రం అని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
నాలుగు రోజుల్లో సినిమా చేసిన 22 ఏళ్ల కుర్రాడు
కానీ ట్రైలర్ మాత్రం ఆద్యంతం నవ్వులు పూయించింది. క్రేజీగా ఉంది. నవ్వులు గ్యారంటీ అనేలా ఉంది. ఈ చిత్రానికి యోహిత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆయన ఏజ్ కేవలం 22 ఏళ్లు మాత్రమే కావడం విశేషం. అదే సమయంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మూవీ పూర్తి చేశారట. ఇది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బడ్జెట్ కూడా అరకోటికి లోపే ఉంటుందని టాక్. ఇక ఇందులో ఝాన్సీతోపాటు చరణ్ పేరి, భాను తేజ కడిమిశెట్టి, అసురకాళి పవన్, అశిష్ కెన్నేడి, సూర్య గౌడ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈటీవీ విన్లో ఈ నెల 16 నుంచి `ఈగో` స్ట్రీమింగ్
ఇక ఈ చిత్రాన్ని ఆర్ఆర్ టాకీస్ పతాకంపై ఉదయ్ సద్దాల నిర్మాతగా వ్యవహరించారు. నాగేశ్వర్ వడ్డే కెమెరామెన్గా, ఆదిత్య బీఎన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ నవంబర్ 16 నుంచి ఇది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈటీవీలో గతంలో వచ్చిన `అనగనగా`, `90 మిడిల్ క్లాస్ బయోపిక్` వంటి మూవీస్ విశేష ఆదరణ పొందాయి. `ఈగో` కూడా ఆ జాబితాలో చేరిపోతుందని చెప్పొచ్చు.

