బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి రణబీర్‌కు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన రణబీర్ కపూర్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆయనకు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాల ప్రకారం.. రణబీర్ కపూర్ ఒక సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేశారు. దీనిని మహాదేవ్ బుక్ యాప్ ప్రమోటర్లు కూడా ప్రమోట్ చేశారు. ఈ ప్రమోషన్ కోసం రణబీర్ కపూర్ నగదు రూపంలో డబ్బు తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక, మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌పై పలు రాష్ట్రాల పోలీసు విభాగాలతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌పై కేసులు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సేకరించిన డిజిటల్ సాక్ష్యాధారాల ప్రకారం.. ఈ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా ద్వారా డెలివరీ చేయబడింది. అయితే హోటల్ బుకింగ్‌లకు చెల్లింపులకు రూ.42 కోట్లు నగదు రూపంలో జరిగాయని గత నెలలో ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఇక, మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ఈడీ స్కానర్‌లో ఉన్నారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి దర్యాప్తు సంస్థ మరికొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులను సమన్లు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఏఈలో జరిగిన మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ పెళ్లికి, సక్సెస్ పార్టీకి వారు హాజరు కావడంపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.