`శ్రీమంతుడు` అనిపించుకుంటున్న దర్శకుడు సుకుమార్..చదువుకున్న స్కూల్ కోసం
తనకు ఎంతో ఇచ్చిన ఊరుకోసం ఎంతో కొంత తిరిగివ్వాలి.. లేదంటే లావైపోతారనే దాన్ని నిజ జీవితంతో చేసి చూపిస్తున్నారు దర్శకుడు సుకుమార్. `శ్రీమంతుడు` అనిపించుకుంటున్నారు.
దర్శకుడు సుకుమార్ సొంతూరు కోసం మరో గొప్ప పనిచేశారు. తాను చదువుకున్న స్కూల్లో ఓ భవనాన్ని నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్ టైమ్లో కాకినాడలోని రాజోలులో ఓ ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 25లక్షలతో ఆయన ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు తాను చదువుకున్న స్కూల్ కోసం తనవంతు సహాయాన్ని అందించారు. తనకు ఎంతో ఇచ్చిన ఊరుకోసం ఎంతో కొంత తిరిగివ్వాలి లేదంటే లావైపోతారనే దాన్ని నిజ జీవితంతో చేసి చూపిస్తున్నారు. `శ్రీమంతుడు` అనిపించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని తనస్వగ్రామం మట్టపర్రులో పాఠశాల భవనానికి సంబంధించి అదనపు గదుల నిర్మాణానికి తన తండ్రి తిరుపతి నాయుడు పేరిట రూ. 18లక్షలు విరాళం అందించారు సుకుమార్. ఇప్పుడు ఆ గదుల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో వాటిని తాజాగా ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావుతో కలిసి సుకుమార్ ఆదివారం ఈ గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన తండ్రి తిరుపతి నాయుడుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు సుకుమార్. ఈ స్కూల్లోనే తాను చదివానని, తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్టు చెప్పారు. సుకుమార్ చేస్తున్న సేవలు, అందిస్తున్న సాయం పట్ల ఎమ్మెల్యేతోపాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతోపాటు ఆయన్నికొనియాడారు.
ఇక ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా `పుష్ప` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా రూపొందుతుంది. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.