బర్త్ డే సందర్భంగా ఫాంహౌజ్లో మొక్కలు నాటిన దర్శకుడు సంపత్ నంది..
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం తన ఫాంహౌజ్లో మొక్కలు నాటారు.
ఇటీవల `సీటీమార్`తో విజయాన్ని అందుకున్న సంపత్ నంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నేడు(జూన్ 20)న పుట్టిన రోజు సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. బర్త్ డే సందర్భంగా కడ్తాల్లోని తన ఫాంహౌజ్లో ఆయన మొక్కలు నాటారు. తాను నిర్మిస్తున్న `సింబా` చిత్ర యూనిట్ సైతం ఇందులో పాల్గొంది. వీరంతా కలిసి వంద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో, ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు సంపత్ నంది తన బర్త్ డే సందర్భంగా తన టీమ్తో కలిసి మొక్కలు నాటడం పట్ల రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమ అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సినీ డైరెక్టర్ సంపత్ నంది గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో తన జన్మదినం సందర్భంగా 'సింబా' చిత్ర యూనిట్ తో కలిసి మొక్కలను నాటడం ఆనందంగా ఉందన్నారు. `సింబా`కూడా ఫారెస్ట్ ఆఫీసర్ నేపథ్యంతో ప్రకృతికి దగ్గరగా నిర్మిస్తుండటం గొప్ప విషయమన్నారు. 'సింబా' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఎంపీ సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.
గోపీచంద్ హీరోగా రూపొందించిన `సీటీమార్` గతేడాది విడుదల విజయాన్ని అందుకుంది. అటు సంపత్ నందికి, ఇటు గోపీచంద్కి మంచి సక్సెస్ని ఇచ్చింది. ప్రస్తుతం ఆయన తన ప్రొడక్షన్లో మూడు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో ఒకటి `సింబా`. ఈ చిత్రాన్ని రాజేందర్ రెడ్డితో కలిసి దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్నారు. మురళీమనోహర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అటవీ సంరక్షణ ఆవశ్యకతను చాటిచెబుతూ సందేశాత్మకంగా కథాంశంతో సింబా రూపొందుతోంది. ఇందులో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. అనసూయ కీలక పాత్రధారి. దీనికి సంపత్ నందినే కథ అందిస్తున్నారు. వీటితోపాటు `ఓడెల రైల్వే స్టేషన్`, `బ్యాక్ రోజ్` చిత్రాలకు కథ అందిస్తున్నారు.