`జాంబీ రెడ్డి` అంతర్జాతీయ గుర్తింపునిస్తుంది.. వివాదంపై దర్శకుడి వివరణ
జాంబీ రెడ్డి టైటిల్ వివాదంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చాడు. ఇటీవల ప్రకటించిన తమ సినిమా `జాంబీ రెడ్డి`కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందని, ట్విట్టర్లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యిందని, టైటిల్ చాలా బాగుందంటూ చాలా ఫోన్లు, సందేశాలు వచ్చాయన్నారు. సినిమాకు ఇది యాప్ట్ టైటిల్. యానిమేషన్ చాలా బాగుందంటున్నారు.
`అ`, `కల్కి` చిత్రాలతో దర్శకుడిగా తన స్పెషాలిటీని చాటుకున్న ప్రశాంత్ వర్మ ఇటీవల తన కొత్త సినిమాగా `జాంబీ రెడ్డి`ని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో జాంబీ జోనర్లో రూపొందుతున్న తొలి చిత్రమిది. కరోనా వైరస్ ప్రధానంగా రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదంలో ఇరుక్కుంది. టైటిల్ ఓ కమ్యూనిటీని కించపరిచేదిగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ, ఇటీవల మా సినిమా టైటిల్ `జాంబీ రెడ్డి` అని ప్రకటించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా ఫోన్లు, సందేశాలు వచ్చాయి. మీమ్స్ కూడా వచ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెలలకు పైగానే వర్క్ చేశాం. టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్ తో మేమంతా హ్యాపీగా ఉన్నాం.
కొంత మంది మాత్రం టైటిల్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించడం, ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదు. ఇదొక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా మహమ్మారి చుట్టూ కర్నూలు బ్యాక్డ్రాప్లో జరిగే కథ. హాలీవుడ్లో ఈ రకం ఎపిడెమిక్ ఫిల్మ్ చూస్తుంటాం. అక్కడ న్యూయార్క్ లాంటి బ్యాక్డ్రాప్లో ఆ కథ జరిగినట్టు చూపిస్తుంటారు. నేను కర్నూలును బ్యాక్డ్రాప్గా ఎంచుకున్నాను. కర్నూలులో ఇలాంటి మహమ్మారి తలెత్తితే, అక్కడి ప్రజలు ఎలా ఫైట్ చేసి, ఈ మహమ్మారిని నిరోధించి, ప్రపంచాన్నంతా కాపాడతారన్నది ఇందులోని ప్రధానాంశం.
కర్నూలును కథ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. దయ చేసి టైటిల్ని తప్పుగా ఊహించుకోవద్దు. ఈ కులాన్నీ తక్కువ చేసి చూపించడం అనేది కచ్చితంగా ఈ సినిమాలో ఉండదు. నా ఫస్ట్ ఫిల్మ్ `అ`కు జాతీయ స్థాయి గుర్తింపు వస్తే, ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నా. అందరు గర్వపడతారు` అని తెలిపారు.