ప్రముఖ సినీ దర్శకుడు అట్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలతో గుర్తింపు పొందిన ఆయనకు మరో గౌరవం అందించబోతున్నారు. ఇంతకీ అట్లీకి అందబోతున్న ఘనత ఏంటి? 

 

చెన్నైకి చెందిన సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ డాక్టరేట్‌ను జూన్ 14న జరగనున్న సత్యభామ యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అట్లీ స్వీకరించనున్నారు.

ఈ సమాచారంతో అట్లీ అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అట్లీ సుదీర్ఘ సినీ ప్రయాణంలో సాధించిన విజయాలకు గౌరవ సూచకంగా ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్నారు.

కోలీవుడ్‌లో 'రాజా రాణి' చిత్రం ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన అట్లీ, ఆపై తేరి (తెలుగులో పోలీసోడు), మెర్సల్ (అదిరింది), బిగిల్ (విజిల్) వంటి హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. హిందీలో షారూక్ ఖాన్‌తో కలిసి రూపొందించిన 'జవాన్' చిత్రం రూ.1000 కోట్ల గ్రాస్‌ను సాధించి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ ఘన విజయం తర్వాత, అట్లీ తదుపరి ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో కలిసి ఆయన చిత్రం తెరకెక్కించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించబడింది.

ఈ ప్రతిష్ఠాత్మక డాక్టరేట్‌తో అట్లీ సినీ కెరీర్‌లో మరో మైలురాయి చేరుకున్నారు. సాంకేతిక నైపుణ్యం, ప్రేక్షకులకు కావలసిన కమర్షియల్ అంశాల మేళవింపుతో కథలను నెరపడే అట్లీకి ఇది సాంకేతిక రంగం నుంచి లభిస్తున్న గౌరవ గుర్తింపుగా నిలిచింది. జూన్ 14న జరగనున్న డాక్టరేట్ ప్రదానోత్సవం సినీ, విద్యా వర్గాల్లో ఆసక్తిగా మారింది.