అజిత్ చిత్రం రిలీజ్ వెనక దిల్ రాజు..షాకింగ్ స్ట్రాటజీ?
11న రిలీజయ్యే తునివు చిత్రానికి కావాల్సినన్ని థియేటర్లు, షోలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ వెనక దిల్ రాజు ఉన్నారని మీడియా వర్గాల సమాచారం.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ప్రతీ విషయంలో చాలా క్యాల్కులేటెడ్గా సినిమాలు తీస్తూ, పంపిణీ చేస్తూ మంచి సక్సెస్ రేట్తో ముందుకు సాగుతున్నారు. దాదాపు పెద్ద హీరోల సినిలు డిస్ట్రిబ్యూషన్ ఆయన్ని దాటి వెళ్లదు. అలాగే పెద్ద హీరోలతో భారీ బడ్జెట్లో సినిమాలు తీసినా సరే.. తన లెక్క ఫెరఫెక్ట్ గా ఉంటుందని, బడ్జెట్-బిజినెస్ అన్నీ కట్టు తప్పకుండా ఉంటుందని రాజు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ ల విషయంలో ట్విస్ట్ గా మారింది.
ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి మీదే ఉండబోతోందన్నది అందరికీ తెలుసు. అయితే అదే సమయంలో దిల్ రాజు నిర్మించిన విజయ్ వారసుడు కూడా పెద్ద స్థాయిలోనే రిలీజ్ కాబోతోంది. అందుక్కారణం దిల్ రాజు పంపిణీదారుడు కూడా కావడమే. అలాగే దీని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగువాడే. అయితే ఇప్పుడు సంక్రాంతికి భారీగా అజిత్ చిత్రం కూడా దిగుతోంది. ఈ సినిమాకు భారీగా థియేటర్స్ దొరుకుతున్నాయని సమాచారం.
తెగింపు టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం జనవరి 11, బుధవారం రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాతి రోజు వీరసింహారెడ్డి, వారసుడు విడుదలవుతాయి. 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. సంక్రాంతికి భారీ పోటీ ఉండడంతో ముందు వారం ఎలాగూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ అయ్యే అవకాసం లేదు. దాంతో థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి 11న రిలీజయ్యే తునివు చిత్రానికి కావాల్సినన్ని థియేటర్లు, షోలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ వెనక దిల్ రాజు ఉన్నారని మీడియా వర్గాల సమాచారం.
దిల్ రాజు..విజయ్ తో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన పోటీ హీరో సినిమా రిలీజ్ స్వయంగా పెట్టుకోరు. అందుకే ఓ కొత్త నిర్మాతను సీన్ లోకి దించి థియేటర్స్ ఇప్పిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, IVY ప్రొడక్షన్స్ కలిసి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నాయి. కేవలం మూడు కోట్లకే ఈ చిత్రం తెలుగు రైట్స్ దొరికాయని తెలుస్తోంది. ఏ మాత్రం సినిమా బాగుండి వర్కవుట్ అయినా భారీ లాభాలు వచ్చే అవకాసం ఉంది.
వినోద్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళంలో బాగా క్రేజ్ ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు సహా పలు భాషల్లో విడుదల కాబోతోంది.