బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె అస్వస్థతకి గురైంది. ఆమె ఆసుపత్రిలో చేరిందని, ప్రస్తుతం వైద్యుల సమక్షంలో అబ్జర్వేషన్‌లో ఉందని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

స్టార్‌ హీరోయిన్‌ అస్వస్థతకి గురయ్యింది. ఆమె హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో అస్వస్థతకి గురై ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో ఆమె ప్రాథమికంగా చికిత్స తీసుకున్నారు. ఆ వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నోవాటెల్‌లో రెస్ట్ తీసుకుంటున్నట్టు సమాచారం. దీపికా పదుకొనె హార్ట్ బీట్‌ పెరగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే నోవాటెల్‌లో అబ్జర్వేషన్‌లో ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే దీనిపై పీఆర్‌ టీమ్‌ రియాక్ట్ అయ్యింది. అస్వస్థత అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని. ఆమె జనరల్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిపారు. రిపోర్ట్ లు అన్ని బాగానే ఉన్నాయని, ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఆమె నటిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతుందని, ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుందని తెలిపారు. రూమర్స్ నమ్మొద్దని వెల్లడించారు. 

ప్రస్తుతం దీపికా పదుకొనె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తుంది. `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అశ్వనీదత్‌ సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతోపాటు హిందీలో పలు ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉంది దీపికా. షారూఖ్‌ ఖాన్‌తో `పఠాన్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే హృతిక్‌ రోషన్‌తో `ఫైటర్‌` సినిమా చేస్తుంది.