ఓటీటీ కొత్త రూల్స్ః శోభితా దూళిపాళ సినిమాపై ఫిర్యాదు..
శోభితా దూళిపాళ నటించిన `ఘోస్ట్ స్టోరీస్` సినిమా చిక్కుల్లో పడింది. సినిమాలో అభ్యంతరక కంటెంట్ ఉందని ఫిర్యాదు నమోదైంది.
శోభితా దూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన అంథాలజీ హర్రర్ ఫిల్మ్ `ఘోస్ట్ స్టోరీస్`. మూడు భాగాలుగా వచ్చిన ఈ ఫిల్మ్ లో ఓ భాగానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. సినిమాలో అభ్యంతరక కంటెంట్ ఉందని ఫిర్యాదు నమోదైంది. గతేడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ఇది నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఓ సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైమ్లో ఆ పాత్ర మృత శిశువుని చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని ఈ నెల 27న ఫిర్యాదు నమోదు చేశారు.
అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన కొత్త మార్గదర్శకాల్లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్ను కఠినతరం చేసింది.
అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతోపాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట కఠినమైన నిబంధనలతో `రూల్స్-2021`ను రిలీజ్ చేసింది.