#RanbirKapoor:మత విశ్వాసాలు దెబ్బతీశారంటూ రణబీర్ పై ఫిర్యాదు
రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు కావాలనే క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో ఆల్కహాల్ను ఉపయోగించారని, జై మాతా ది అనే నినాదాలు చేశారని సంజయ్ తివారీ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు.
![Complaint Against Ranbir Kapoor Over Viral Christmas Lunch Video JSP Complaint Against Ranbir Kapoor Over Viral Christmas Lunch Video JSP](https://static-ai.asianetnews.com/images/01hjqjxk20v3ghker5fccyezyp/rana-jpg_363x203xt.jpg)
రీసెంట్ గా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ మూవీ బ్లాక్బాస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ జోష్లో ఉన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన కేక్ కటింగ్ ఈ వివాదానికి కారణమైంది. క్రిస్మస్ వేడుకలను నటుడు రణబీర్ కపూర్ ఇంట కూడా జరిగాయి. కపూర్ ఫ్యామిలీ అంతా కలిసి ముంబైలోని కునాల్ కపూర్ ఇంట్లో క్రిస్మస్ సంబురాలు ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో రణ్బీర్ కపూర్తోపాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో జహాన్ కపూర్ కేక్పై వైన్ పోయగా రణ్బీర్ కపూర్ లైటర్తో నిప్పు అంటించాడు. అంతేకాదు ‘జై మాతా ది’ అని రణ్బీర్ అనడం వైరల్గా మారిన వీడియోలో వినిపించింది. హిందూ మతంలో ఇతర దేవతలను పిలిచే ముందు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇది హిందువుల సంప్రదాయం. అయితే, నటుడు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు కావాలనే క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో ఆల్కహాల్ను ఉపయోగించారని, జై మాతా ది అనే నినాదాలు చేశారని సంజయ్ తివారీ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు.
రణ్బీర్ కపూర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ముంబైకి చెందిన ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా అనే ఇద్దరు న్యాయవాదులు ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానపరిచారని పేర్కొన్నారు.
ఆ పిర్యాదులో ...‘‘హిందూమతంలో ఇతర దేవతలను పూజించడానికి ముందు అగ్ని దేవుడిని ఆరాధిస్తారు. అయితే కపూర్, అతడి కుటుంబ సభ్యులు ఇతర మతానికి సంబంధించిన పండుగ వేడుకల్లో హిందూమతంలో నిషేధిత మత్తు పదార్థాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. జై మాతా ది అని నినాదాలు కూడా చేశారు’’ అని ఫిర్యాదులో న్యాయవాదులు ప్రస్తావించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ తరహా వీడియోల ప్రచారం కారణంగా శాంతిభద్రతలు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రణ్బీర్ కపూర్పై సెక్షన్ 295 ఏ (మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం), సెక్షన్ 298 (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), సెక్షన్ 500 (పరువు నష్టం), సెక్షన్ 34 కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
కాగా కునాల్ కపూర్ నివాసంలో రెండు రోజులక్రితం రణబీర్ కపూర్, అతడి కుటుంబ సభ్యులు క్రిస్మస్ లంచ్లో భాగంగా కేక్ కటింగ్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో 'ఫరాజ్' సినిమాతో అరంగేట్రం చేసిన యువ నటుడు జహాన్ కపూర్తోపాటు సన్నిహిత కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.