రవితేజ చిత్రంతో కామెడీ హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు వేణు తొట్టెంపూడి ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ చిత్రంతో ఆయన కమ్ బ్యాక్ అవుతున్నారు.
`స్వయంవరం`, `హనుమాన్ జంక్షన్`, `అల్లరే అల్లరి`,`గోపి గోపిక గోదావరి` వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. కామెడీ సినిమాలతో స్టార్ హీరోలకు పారలల్గానూ రాణించారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. 2013 తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఇన్నాళ్లకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ చిత్రంతో ఆయన కమ్ బ్యాక్ అవుతున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న `రామారావు`(ఆన్ డ్యూటీ) చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రం రూపొందుతుంది. ఇందులో దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది. చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం వేణు తొట్టెంపూడిని సినిమాలోకి ఆహ్వానిస్తూ పోస్టర్ని పంచుకున్నారు.
1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా పరిచయం అయిన వేణు మొదటి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన 26 సినిమాల్లో నటించగా, దాదాపు పదిహేనుకుపైగా చిత్రాలు విజయం సాధించడం విశేషం. హీరోగా వంశీ దర్శకత్వంలో `గోపి గోపిక గోదావరి` సినిమా ఆయనకు హీరోగా చివరి చిత్రం. 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన `దమ్ము` చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు.