కంటెంట్ ఉన్న చిత్రాలతోనే మెప్పిస్తున్నారు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. తాజాగా ఆయన రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలపై స్పందించారు. పెద్ద సినిమాలు చేయకపోవడంపై రియాక్ట్ అవుతూ పెద్ద షాకిచ్చారు.
`అర్జున్ రెడ్డి` చిత్రంతో పాపులర్ అయ్యారు రాహుల్ రామకృష్ణ. అంతకు ముందు `సైన్మా` షార్ట్ ఫిల్మ్ తో మెప్పించారు. `గీత గోవిందం`, `జాతిరత్నాలు` చిత్రాలతో మెప్పించారు. ముఖ్యంగా `జాతి రత్నాలు` రాహుల్ రామకృష్ణ కామెడీ ఆద్యంతం మెప్పిస్తుంది. ఇప్పుడు ఆయన `ఇంటింటి రామాయణం` చిత్రంతో రాబోతున్నారు. ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించగా, ఇందులో రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ స్టార్ పెద్ద సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా పెద్ద సినిమాలు, రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు చేయడం లేదు ఎందుకనే ప్రశ్నకి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ, కథ లేకపోతే చేయడం ఎందుకు అని తిరిగి ప్రశ్నించారు. డబ్బుల వెనకాల పడాలనే ఆశలేదన్నాడు. మంచి సినిమా చేయాలని ఉందని, ఇలాంటి సినిమాలు చేస్తేనే ఇంటికెళ్లాక చక్కగా తిని పడుకోవాలనిపిస్తుందన్నారు. తనకు ప్రాంతీయ భావన అని ఏం లేదు. కథ నచ్చితే ఏదైనా చేస్తాననని, ఈ సినిమాలో కథ బాగుంది, పాత్రలు బాగున్నాయి, సురేష్ నెరేషన్ నచ్చి చేశానని చెప్పారు.
ఇంకా చెబుతూ, తెలంగాణలో చాలా ప్రాంతాలున్నాయి. ఆ కల్చర్ని `బలగం` ఓ రకంగా చూపించింది. మా సినిమా ఇంకోరకంగా చూపిస్తుంది. ఎప్పట్నుంచో మరుగన బడ్డ తెలంగాన కల్చర్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇప్పుడు చక్కగా, అందంగా కనిపిస్తుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రాంతాలకు, భేదాలకు భిన్నంగా ఉన్న సిసలైన కల్మషం లేని సినిమా ఇది. మన మనస్తత్వాలను, మన మనోభావాలను చాలా అలవోకగా, చాలా సులభంగా చూపిస్తూ మా నుంచి మంచి మంచి నటనను రాబట్టుకున్నారు దర్శకుడు. ఈ సినిమాలో `జాతిరత్నాలు` కంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశమిచ్చిన నాగవంశీ, మారుతి, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
`ఇంటింటి రామాయణం` సినిమా చేయడానికి ప్రధాన కారణం చెబుతూ, `నేను ఈ సినిమా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సురేష్ రాసిన కథ. రెండో కారణం ఏంటంటే ఈ సినిమాలో భాగమైన వంశీ, మారుతి, నరేష్, నవ్య, గంగవ్వకి అందరికీ అభిమానిని. సినిమా చేసిన తర్వాత సురేష్ కి కూడా అభిమాని అయ్యాను. నేనొక ఫ్యాన్ బాయ్ గా ఈ సినిమా చేశా` అని వెల్లడించారు రాహుల్ రామకృష్ణ.
ఇందులో ప్రముఖ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. మొదట దీనిని డిజిటల్ సినిమాగానే ప్రారంభించాం. అవుట్ పుట్ చూసిన తరువాత థియేటర్ లో ఆడుతుందన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఇటీవల వచ్చిన దిల్ రాజు `బలగం` సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే రూపొందింది. ఈ సినిమా దానికి భిన్నంగా ఉంటుంది. నా స్నేహితులు నిర్మాతలుగా పరిచయమవుతున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను` అని అన్నారు.
ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. `సురేష్ నా దగ్గర కొత్తజంట నుంచి ఐదారు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. ఆ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టిన సురేష్ ఒకసారి కథ రాసుకున్నాను అని చెప్పాడు. కథ వినగానే నాకు చాలా నచ్చింది. ఇది ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ. ఇతర భాషల్లో విడుదల చేసినా ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నాగవంశీతో కలిసి నేను ప్రొడక్షన్ చేసిన మొదటి సినిమా లవర్స్. అప్పటినుంచి నిర్మాతలుగా మా ప్రయాణం మొదలైంది. వెంకట్ సినిమా మీదున్న ప్రేమతో డిస్ట్రిబ్యూషన్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా సినిమాను ప్రేమించే వెంకట్, గోపీచంద్ లను ఈ సినిమాతో నిర్మాతలుగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. రాహుల్ కేవలం కథ విని ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. చిన్న సినిమాలను ఆదరించండి. ముఖ్యంగా ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించండి` అని వెల్లడించారు.
చిత్ర దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఆహా ఒరిజినల్ ఫిల్మ్ గా తీశాం. అయితే ఇంతమంచి సినిమాని ప్రేక్షకులకు థియేటర్ అనుభూతి కలిగిస్తే బాగుంటుందని వంశీ, మారుతి సూచించడంతో ఇది సాధ్యమైంది. టీమ్ అందరి కృషి వల్ల అనుకున్నదానికంటే తక్కువ రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. నా నిర్మాతలు వెంకట్, గోపి.. అలాగే థియేటర్ రిలీజ్ కి ఒప్పుకున్న ఆహా వారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఇది ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కింది. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కళ్యాణి మాలిక్, కాసర్ల శ్యామ్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. తెలంగాణ మాండలికంలో కాసర్ల శ్యామ్ ఎంతో సాయం చేశారు" అన్నారు.
సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం 'ఇంటింటి రామాయణం'. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
