Sirivennela Death : తెలుగు పాటకు ఊపిరులూదారు .. సిరివెన్నెల మరణంపై సీజేఐ ఎన్వీ రమణ దిగ్భ్రాంతి
సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరివెన్నెల ఇకలేరు అని తెలిసి ఎంతో విచారించానని ఆయన అన్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో (tollywood) విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు (supreme court) ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ (justice nv ramana) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరివెన్నెల ఇకలేరు అని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో.. సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదిందని సీజేఐ ప్రశంసించారు. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు ఎన్వీ రమణ అన్నారు. సాహితీ విరించి సీతారామశాస్త్రిగారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, లక్షలాది అభిమానులకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఓ ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సిరివెన్నెల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాష ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి .’’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (ys jagan mohan reddy) కూడా సీతారామశాస్త్రికి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులని... ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.
అటు తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naiduకూడా సిరివెన్నెల మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘‘ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. తన పాటలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3వేలకు పైగా పాటలు రాసి కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ’’ అని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా సిరివెన్నెల మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘‘ వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్కవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. బలమైన భావాన్ని... మానవతావాత్వాన్ని... ఆశావాదాన్ని చిన్నచిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి శ్రీ శాస్త్రి గారు. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శాస్త్రి గారు కోలుకొంటారు అని భావించాను. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ సీతారామశాస్త్రి గారు మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు... తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. వారిని కేవలం సినీ గీత రచయితగా చూడలేము. ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది.
నేను నటించిన సుస్వాగతంలో ‘ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి..’ పాట కావచ్చు, ‘తొలిప్రేమ’లో ‘ఈ మనసే..’ పాటల్లో అలతి అలతి పదాలతో ప్రేమ భావనలు చెప్పారు. ప్రేమ గీతాలు, అల్లరి పాటలు.. ఏవైనా అంతర్లీనంగా మంచి చెప్పాలని తపించేవారు. ఒక కవిగా సమాజాన్ని నిలదీసి, బాధ్యతలు గుర్తు చేసేవారు. ‘నిగ్గదీసి అడుగు...’, ‘అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని..’ లాంటి పాటలు వింటే సమాజాన్ని నిత్యచైతన్యంగా ఉంచాలని శ్రీ శాస్త్రి గారు ఎంత తపించారో అర్థం అవుతుంది. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు...’, ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..’ లాంటి పాటల్లో ఆశావాదాన్ని అందించారు. భావితరాలకు మన తెలుగు సాహితీ సంపదను వారసత్వంగా ఇవ్వాలని తపించేవారు. శాస్త్రి గారి రచనల్లోని వైవిధ్యాన్ని చూస్తే ఆయన కలానికి ఎన్ని పాళీలో అనిపిస్తుంది.
శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో లోటు. నాపట్ల ఎంతో అప్యాయతను కనబరిచేవారు. వారితో మాట్లాడితే - సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయ వాదం, సామ్యవాదం వరకూ ఎన్నో అంశాల గురించి కూలంకషంగా చెప్పేవారు. శ్రీ శాస్త్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అని పవన్ ఒక ప్రకటనలో తెలిపారు.