సీనియర్‌ నటి, తొలితరం హీరోయిన్‌, టాలీవుడ్‌ సత్యభామ శుక్రవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారిలో మంత్రి తలసాని, చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ వంటి సెలబ్రిటీలున్నారు.   

సీనియర్‌ నటి, తొలితరం హీరోయిన్‌, టాలీవుడ్‌ సత్యభామ శుక్రవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారిలో మంత్రి తలసాని, చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ వంటి సెలబ్రిటీలున్నారు.

చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటిస్తూ, `సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌. 

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన విచారం వ్యక్తం చేశారు. సీనియర్ నటీమణి జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

అగ్ర హీరో బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేస్తూ, `అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా` అని చెప్పారు. 

జనసేన అధినేత, హీరో పవన్‌ కళ్యాణ్‌ సంతాపం తెలియజేస్తూ, `ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. ఆమె మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా` అని తెలిపారు.

మహేష్‌బాబు సంతాపం తెలియజేస్తూ, నటి జమున మరణవార్త విని బాధగా ఉంది. ఆమె చేసిన అన్ని ఐకానిక్‌ పాత్రలు, పరిశ్రమకి ఆమె చేసిన అపారమైన సహకారం కోసం ఆమెను ప్రేమతో గుర్తుంచుకుంటారు. వారి ఫ్యామిలీకి నా సానుభూతి తెలియజేస్తున్నా` అతని ట్వీట్‌ చేశారు మహేష్. 

ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ, `దాదాపుగా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. `గుండమ్మ కథ`, `మిస్సమ్మ` లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా` అని అన్నారు తారక్‌. మరోవైపు కళ్యాణ్‌ రామ్‌ రియాక్ట్ అవుతూ, `మహానటి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన. జమున గారి కుటుంబసభ్యులు మరియు వారి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి` అని చెప్పారు.

మరోవైపు తెలుగు సినిమా సీనియర్‌ నటి జమున మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం సంతాపం తెలిపారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నటిగానే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారని గుర్తుకు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.