శుక్రవారం విడుదలైన `బింబిసార`, `సీతారామం` చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసలు కురిపించారు.

చాలా రోజుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కళ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం(ఆగస్ట్ 5)న విడుదలైన రెండు సినిమాలు `బింబిసార`(Bimbisara), `సీతారామం`(SitaRamam) పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్‌ కమర్షియల్‌ అంశాలతో మాస్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్‌ లవ్‌ స్టోరీతో క్లాసీ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతుంది. ఇలా `బింబిసార`, `సీతారామం` రెండూ విజయవంతంగా రన్‌ అవుతున్నాయి. 

ఈ రెండు సినిమాలు విజయాలు సాధించడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ కళకళలాడుతుందంటూ రెండు సినిమాలకు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తాజాగా ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. `ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్ను విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా `సీతారామం`, `బింబిసార` చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు` అని తెలిపారు చిరంజీవి. 

Scroll to load tweet…

మరోవైపు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) సైతం రెండు చిత్రాలకు అభినందనలు తెలిపారు. ఒకే రోజు రెండు సినిమాలు విజయం సాధించాయని తెలిసి చాలా ఆనందమేసిందని, రెండు సినిమాల గురించి చాలా మంచి విషయాలు విన్నానని చెప్పారు విజయ్‌. `బింబిసార` చిత్ర యూనిట్‌కి, `సీతారామం` సినిమా యూనిట్‌కి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్స్ చేశారు విజయ్‌ దేవరకొండ. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే శుక్రవారం మొత్తం చిరంజీవిని టార్గెట్‌ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోవడం గమనార్హం. `మెగాస్టార్‌కళ్యాణ్‌రామ్‌` అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తూ చిరంజీవి ఇటీవల నటించిన `ఆచార్య`తో కంపేర్‌ చేస్తున్నారు. చిరుకి, కళ్యాణ్‌ రామ్‌కి ముడిపెడుతూ ట్రోల్స్ చేశారు. ఈ విషయంలో మెగా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. కానీ వాటన్నింటికి అతీతంగా ఇప్పుడు చిరంజీవి `బింబిసార` చిత్రానికి అభినందనలు తెలియజేస్తూ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. 

కళ్యాణ్‌ రామ్‌(Kalyan Ram) హీరోగా నటించిన `బింబిసార` చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కే నిర్మించారు. కేథరిన్‌, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటించారు. మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, రష్మిక మందన్నా, సుమంత్‌, తరుణ్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించిన `సీతారామం` చిత్రానికి హనురాఘవపూడి దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్నాదత్‌ నిర్మించారు. ఈరెండూ శుక్రవారం థియేటర్లో విడుదలయ్యాయి.