అయోధ్యలో చిరంజీవి కుటుంబానికి ఘన స్వాగతం! వీడియో వైరల్
నేడు అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ అయోధ్య చేరుకున్నారు. వీరికి అయోధ్యలో ఘన స్వాగతం లభించింది.
![chiranjeevi ram charan gets a warm welcome in ayodhya ksr chiranjeevi ram charan gets a warm welcome in ayodhya ksr](https://static-ai.asianetnews.com/images/01hmqvrvymh8sz8xzber1mc6xk/whatsapp-image-2024-01-22-at-11-19-27-jpeg_363x203xt.jpg)
ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కల సాకారం అయ్యింది. నేడు ప్రతిష్టాత్మక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో చిరంజీవి ఒకరు. టాలీవుడ్ కి చెందిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ లకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీంతో చిరంజీవి కుటుంబంతో పాటు హాజరయ్యారు.
చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్ లో చిరంజీవి కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శాలువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వారితో ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు. తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి స్వయంగా ఆహ్వానించిన భావన కలుగుతుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడని సమాచారం.