చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి... కళాతపస్వి విశ్వనాథ్ మరణంపై చిత్ర ప్రముఖుల దిగ్భ్రాంతి!
సినిమా ప్రపంచం ఓ లెజెండ్ ని కోల్పోయింది. ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు ఇది తీరని లోటు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కీర్తిని కొనియాడుతున్నారు.

ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి కే. విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయోసంబంధిత రుగ్మతలతో ఆయన భాదపడుతున్నారు. అనారోగ్యం బారినపడిన విస్వనాథ్ గారిని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతి వార్త చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విశ్వనాథ్ గారికి సంతాపం ప్రకటించారు. ''తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి విశ్వనాథ్ మృతి పై విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారు మరణించారన్న వార్త కలచివేసింది. ఆయన దర్శకత్వంలో స్వాతికిరణం మూవీ చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. అని ట్వీట్ చేశారు.
అలాగే .విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను పిడుగుపాటుకు గురిచేసిందని ఆయన ఆవేదన చెందారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు. నటనకు సంబంధించిన ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి, ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోయాయి.