సారాంశం

ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ రాబోతుంది. ఓటీటీలోనూ రీ రిలీజ్‌ల ట్రెండ్‌ మొదలువుతుంది. అందుకు ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా` శ్రీకారం చుట్టడం విశేషం. 

థియేటర్లలో ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. స్టార్‌ హీరోల సినిమాల నుంచి యంగ్‌ స్టర్స్ మూవీస్‌ వరకు రీ రిలీజ్‌ అవుతున్నాయి. చాలా వరకు యావరేజ్‌గా ఆడితే, కొన్ని మంచి వసూళ్లని రాబడుతున్నాయి. తాజాగా చిరంజీవి నటించిన `శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌` చిత్రం కూడా నవంబర్‌ 4న రీ రిలీజ్‌ కాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ రాబోతుంది. ఓటీటీలోనూ రీ రిలీజ్‌ల ట్రెండ్‌ మొదలువుతుంది. అందుకు ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా` శ్రీకారం చుట్టడం విశేషం. 

ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. చిత్రాలు ఓటీటీలో రీ రిలీజ్‌ కాబోతున్నాయి. దీనికి `ఆహా` ఏర్పాట్లు చేసింది. అంతేకాదు లేటెస్ట్ టెక్నాలజీ ప్రింట్‌తో ఈ చిత్రాలను `ఆహా` తన ఓటీటీ మాధ్యమంలో స్ట్రీమింగ్‌ చేస్తుంది. ఈ సందర్భంగా థియేటర్లలోనే రీ రిలీజ్‌లు ఉంటాయా? మేం కూడా దింపుతున్నామంటూ ఈ ముగ్గురి హీరోల సినిమాలను ప్రకటించింది. 

ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ `ఘారానా మొగుడు` సినిమా, అలాగే మహేష్‌ బాబు సూపర్‌ హిట్‌ `అతడు`తోపాటు రామ్‌చరణ్‌ సంచలన మూవీ `మగధీర` ఉన్నాయి.  వీటిలో `మగధీర`ని గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్‌ నిర్మించారు. `ఆహా` అధినేతల్లో ఆయన ప్రముఖులు అని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆచిత్రాన్ని `ఆహా`లోకి తీసుకొస్తున్నారు. మరోవైపు దేవీ ఫిల్మ్స్ పై నిర్మించి `ఘరానా మొగుడు`, జయభేరి ఆర్ట్స్ నిర్మించిన `అతడు` చిత్రాన్ని కూడా `ఆహా`లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన డేట్లని ప్రకటించింది `ఆహా`. 

ఇందులో మొదటగా రామ్‌చరణ్‌ హీరోగా నటించిన రాజమౌళి మూవీ `మగధీర` విడుదల కాబోతుంది. నవంబర్‌ 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. అనంతరం మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన `అతడు` సినిమా నవంబర్‌ 10 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన `ఘారానామొగుడు` మూవీని నవంబర్‌ 17 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నారు.