ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారుః పీవీ సింధుకి చిరు, మహేష్, అనసూయ అభినందనలు
పీవీ సింధుకి దేశ రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి, దేశ ప్రజానికం ప్రశంసలు, అభినందనల కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, యాంకర్ అనసూయ అభినందించారు.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్కి మరో పతకం దక్కింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా మెడల్ సాధించింది. సెమీ ఫైన్లో ఓడిపోయిన ఆమె, కాంస్య పతకం కోసం నేడు జరిగిన పోరులో విజయం సాధించింది. చైనాకి చెందిన హీ బింగ్ జీవోతో జరిగిన మ్యాచ్లో పీవీ సింధు 21-13, 21-15 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్కి ఈ ఒలింపిక్స్ లో రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజతం సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పీవీ సింధుకి దేశ రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి, దేశ ప్రజానికం ప్రశంసలు, అభినందనల కురిపిస్తున్నారు. తాజాగా చిరంజీవి స్పందించారు. `అభినందనలు పీవీ సింధు. పతకం గెలుచుకోవడం, వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సాధించిన రెండు పతకాలు భారతీయ మహిళలే కావడం గమనార్హం. మా మహిళా శక్తిని ఆపలేరు. మీరాబాయి చాను, పీవీసింధు మీరు భారత్ గర్వపడేలా చేశారు` అని అభినందించారు మెగాస్టార్.
సూపర్ స్టార్ మహేష్ సైతం అభినందించారు. `మరో చారిత్రాత్మక విజయం. భారతదేశం అత్యుత్తమంలో ఒకటి. కాంస్యం గెలిచినందుకు అభినందనలు పీవీ సింధు. చాలా సంతోషంగా గర్వంగా ఉంది` అని పేర్కొన్నారు.
`జబర్దస్త్` యాంకర్ అనసూయ సైతం అభినందించారు. మమ్మల్ని గర్వపడేలా చేశారు పీవీ సింధు. బ్యాక్ టూ బ్యాక్ రెండు పతకాలు సాధించినందుకు అని శుభాకాంక్షలు తెలిపింది అనసూయ.