`నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవి`.. `వాల్తేర్ వీరయ్య` సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్
చిరంజీవి తరచూ తన సినిమాల అప్డేట్లు లీక్ చేస్తుంటారు. తాజాగా మరో లీక్ ఇచ్చాడు. `వాల్తేర్ వీరయ్య` సినిమాలోని మరో సాంగ్ ని లీక్ చేశారు.
చిరంజీవి తరచూ తన సినిమాల అప్డేట్లు లీక్ చేస్తుంటారు. తాజాగా మరో లీక్ ఇచ్చాడు. `వాల్తేర్ వీరయ్య` సినిమాలోని మరో సాంగ్ ని లీక్ చేశారు. `నువ్వు శ్రీదేవైతే, నేను చిరంజీవి` అంటూ సాగే పాటని లీక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటని చిరు సైలెంట్గా లీక్ చేశారు. మాస్ బీట్తో సాగే ఈ పాట చిన్న గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎనర్జిటిక్గా ఉంది.
ఈ పాటని ఫ్రాన్స్ లో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం చిరంజీవి, శృతి హాసన్తోపాటు చిత్ర బృందం అక్కడికి వెళ్లారు. అయితే ఈ నెల 12తో ఈ పాట షూటింగ్ పూర్తయ్యిందట. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ అందాలను ఆయన ప్రత్యేకంగా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఫ్రాన్స్ లోని అందాలను చూసి ఎగ్జైట్ అయ్యారట చిరు. అభిమానులతో పంచుకోవాలని సంబరపడి వెంటనే షేర్ చేశారు. ఇందులో చిరంజీవి చెబుతూ,
`ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ శృతి హాసన్తో ఓ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది. మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది విజువల్స్ గానీ, సాంగ్గానీ. మేం చేసిన లొకేషన్లు రియల్లీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో ఈ లొకేషన్ ఉంది. స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్లో ఉన్న ఆర్బ్స్ మౌంటేన్ లోయలో ఇది ఉంటుంది. ఆ లోయ అందాలు మంచుతో కప్పబడిన తర్వాత ఆ అందం అంతా ఇంతా కాదు. నాకైతే చాలా బాగా నచ్చింది.
మైనస్ 8 డిగ్రీల చలిలో డాన్సు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ మిమ్మల్ని అలరించడానికి ఆ కష్టం కష్టంగా అనిపించదు. టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం బాగా వచ్చిందని నమ్ముతున్నాం. నేను ఆపుకోలేక మీతో పంచుకోవాలనిపించింది. నేనే స్వయంగా అందమైన విజువల్స్ ని బంధించి మీ కోసం పంపిస్తున్నా. మీరూ చూసి ఆనందిస్తారనిపించింది. త్వరలో లిరికల్ వీడియో మీ ముందుకు రాబోతుంది. అయితే ఈ సాంగ్కి సంబంధించిన చిన్న బిట్ని మీకు లీక్ చేస్తున్నా` అంటూ లిరిక్ పంచుకున్నాడు చిరు. నువ్వు శ్రీదేవైతే.. ఆ అయితే.. నేను చిరంజీవంటా.. నాయ్యే నాయ్యే.. అంటూ దేవి శ్రీ ప్రసాద్ పాడిన పాటని విడుదల చేశారు చిరంజీవి. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చిరంజీవికి జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందట. రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. యూరప్లో వాటిని చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పూర్తయ్యింది. మరో సాంగ్ ని చిత్రీకరించనున్నారట. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు.