నిందుతుడు రాజుని పట్టిస్తే, రూ. 50వేలు రివార్డ్ ఇస్తా.. ఆర్పీ పట్నాయక్
సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ స్వయంగా తనవంతు రివార్డ్ ప్రకటించారు. నిందితుడు రాజును పట్టుకొని అప్పగించిన వారికి రూ. 50 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
చిన్నారి చైత్ర మర్డర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఘటన జరిగి దాదాపు వారం రోజులు కావస్తున్నా, నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ప్రజల్లో ఆవేశం పెల్లుబుకుతోంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణా పోలీసులు నిందితుడు రాజు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిన్న నిందుతుడు రాజు ఫొటోతో పాటు, ఆనవాళ్లు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఆచూకి తెలిపిన వారికి రూ. 10లక్షలు భారీ నజరానా సైతం ప్రకటించడం జరిగింది.
నిందితుడు రాజును కఠినంగా శిక్షించడం ద్వారా చైత్రకు న్యాయం చేయాలని, సినీ రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు. తాజాగా సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ స్వయంగా తనవంతు రివార్డ్ ప్రకటించారు. నిందితుడు రాజును పట్టుకొని అప్పగించిన వారికి రూ. 50 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
పట్నాయక్ మాట్లాడుతూ.. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని అభిప్రాయపడ్డారు.