తమిళనాడులోని రోహిణి థియేటర్ యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టికెట్ కొనుగోలు చేసినప్పటికీ ట్రైబల్స్ను లోనికి అనుమతించకపోవడంపై అక్కడి సిబ్బందిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని ఓ థియేటర్ యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తమిళ స్టార్ హీరో శింబు నటించిన ‘పత్తు తల’ చిత్రం ఈరోజువిడుదలైంది. ఈ సినిమా చూసేందుకు చెన్నైనలోని రోహిని థియేటర్కు పెద్ద ఎత్తున సినీ ప్రేక్షకులు వచ్చారు. అయితే ఈ చిత్రం చూసేందుకు వచ్చిన నరిక్కువర్ వర్గానికి చెందిన ట్రైబల్స్ను మాత్రం థియేటర్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. వారు టికెట్ కొనుగోలు చేసిన లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా.. థియేటర్ మేనేజ్మెంట్ వారిని ఆపేసింది.
అయితే ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రోహిణి థియేటర్ యాజమాన్యం ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గిరిజన కుటుంబంపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.. ‘‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్ను హాల్లోకి తరువాత అనుమతించారని విన్నాను. అసలు వారిని అనుమతించకపోవటం ఆమోదయోగ్యం కాదు. కళ అందరికీ చెందుతుంది’’ అని పేర్కొర్నారు.

ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. అనంతరం థియేటర్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ‘‘ఈ రోజు ఉదయం పత్తు తల సినిమా ప్రదర్శనకు ముందు మా ప్రాంగణంలో జరిగిన పరిస్థితిని మేము గమనించాము. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో కొంతమంది వ్యక్తులు తమ పిల్లలతో పాటు పత్తు తల చిత్రాన్ని చూడటానికి సినిమా హాల్లోకి అనుమతించాలని కోరారు. ఈ చిత్రాన్ని అధికారులు యూ/ఏ సెన్సార్ చేసిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఏ సినిమాని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చూడటానికి అనుమతించరు. ఈ కారణంగా మా టిక్కెట్ తనిఖీ సిబ్బంది 2,6,8,10 సంవత్సరాల పిల్లలతో వచ్చిన కుటుంబానికి అనుమతి నిరాకరించారు.
అయితే.. గుమిగూడిన ప్రేక్షకులు కోలాహలంగా మారి, పూర్తి అవగాహన లేకుండా పరిస్థితిని భిన్నమైన దృక్కోణంలో తీసుకున్నందున.. ఏదైనా శాంతిభద్రత సమస్యను నివారించడానికి, విషయాన్ని నిర్వీర్యం చేయడానికి.. అదే కుటుంబాన్ని సమయానికి సినిమా చూడటానికి అనుమతించారు’’ అని థియేటర్ యాజమాన్యం పేర్కొంది.
అయితే థియేటర్ యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని మభ్యపెట్టే చర్యగా వారు అభివర్ణించారు. 2020లో విడుదలైన రజనీ దర్బార్కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని.. కేవలం 10 ఏళ్ల వయసున్న నటుడు రజనీ మనవడు లింగను సినిమా చూడటానికి ఎలా అనుమతించారని కొందరు రోహిణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రజనీ ఫ్యామిలీకి ఒక చట్టం.. వీరికి మరో చట్టమా అని నిలదీశారు. అదేవిధంగా గతంలో యూ/ఏ సర్టిఫికేట్ పొందిన సినిమాలకు పిల్లలను అనుమతించారని చాలా మంది రోహిణి థియేటర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘యూ/ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలను 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడవచ్చు. దశాబ్దాలుగా థియేటర్ వ్యాపారంలో ఉన్నందున ఈ సాధారణ నియమం తెలియనట్లు మీరు నటించడం మానేయండి. అన్ని యూ/ఏ సినిమాల కోసం మీరు ఎల్లప్పుడూ 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని లోపలికి అనుమతించారు. మీరు CASTEIST’’ అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.
