అప్పుల్లో కూరుకుపోయి ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమాను తెరకెక్కించామన్నారు కార్మేని సెల్వం దర్శకుడు రామ్ చక్రి. సముద్ర ఖని లాంటి సీనియర్ స్టార్స్ నటించిన ఈసినిమా గురించి చాలా విషయాలను దర్శకుడు షేర్ చేసుకున్నారు.
తమిళ తెలుగు భాషల్లో రిలీజ్..
పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి ఈ సినిమాపై కీలక విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘ఆర్య’. ఆ తర్వాత ఆనంద్, గోదావరి మూవీస్ చూశా. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది. ఒక వైపు ఆర్య లాంటి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమాలు ఉంటే, మరో వైపు శేఖర్ కమ్ముల గారి ఆనంద్, గోదావరి లాంటి హృదయాన్ని తాకే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అన్నారు''.
శేఖర్ కమ్ముల ఏకలవ్య శిష్యుడు..
రామ్ చక్రి మాట్లాడుతూ.. ''నేను శేఖర్ కమ్ముల గారితో నేరుగా పని చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ, ఆయనను నా గురువు, మెంటర్గా భావిస్తాను. ఆయన సినిమాలను చూస్తూ ఎంతో నేర్చుకున్నాను. అలాగే నా దర్శక గురువు కె.వి. గుహన్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఇద్దరూ నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇక ‘కార్మేని సెల్వం’ విషయానికొస్తే.. ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కథతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్గా మూవీ ఉంటుంది '' అని అన్నారు.
'' సముద్రఖని గారు ఆయన పాత్రలోని ప్రతి షేడ్ను అద్భుతంగా పండించారు. మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్ను పండించారు. ఆయనతోపాటు గౌతమ్ మీనన్ గారు, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది. మ్యూజిక్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం . ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ పేరుతో మా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ వర్క్ చేశారు. సంగీతం అనేది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ లేదా సింగర్స్దే కాదు.. ఇన్స్ట్రుమెంటలిస్టులు, సౌండ్ ఇంజినీర్లు, మిక్సింగ్ టీమ్, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్లు కలిసి చేసే పనిగా వారు భావించారు. ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రతి పాటకు పని చేసిన అందరికీ క్రెడిట్ ఇవ్వడం, అలాగే రెవెన్యూ షేర్ చేయడం మా లక్ష్యం. ఇది మ్యూజిక్ వెనుక ఉన్న అసలు హీరోలకు గుర్తింపు ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నం అని అన్నారు ''
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా
రామ్ చక్రి మాట్లాడుతూ.. '' మా డీఓపీ యువరాజ్ దక్షణ్, ఎడిటర్ జగన్లకు ఎంతో అనుభవం ఉంది. థియేటర్లో ఈ సినిమా విజువల్స్ చూస్తే, కథను ఎంత గ్రాండ్గా తీసుకెళ్లామో అర్థమవుతుంది. ఇక మా ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కథపై నమ్మకం ఉంచి, మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి మాకు సహకరించారు. ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా. కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’’.అని దర్శకుడు అన్నారు.


