రామ్‌ పోతినేని నెక్ట్స్ సినిమా కన్ఫమ్‌ అయ్యింది. `అఖండ` చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

టాలీవుడ్‌లో మరో కొత్త కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. మాస్‌, యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu), ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌పోతినేని(Ram Pothineni) కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా శుక్రవారం సాయంత్రం చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. గత కొంత కాలంగా వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని పుకార్లు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటిని కన్పమ్‌ చేస్తూ యూనిట్‌ బోయపాటి-రామ్‌(BoyapatiRapo) కాంబో సినిమాని ప్రకటించింది. 

ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించబోతుండటం విశేషం. ఓ రకంగా ఇది ఇటు రామ్‌పోతినేనికి, అటు దర్శకుడు బోయపాటికి ఫస్ట్ పాన్‌ ఇండియా చిత్రంగా చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్‌ `ది వారియర్‌` పేరుతో తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రంలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకుడు. అనంతరం ఈ చిత్రం తెరపైకి రాబోతుంది. 

Scroll to load tweet…

ఇక దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల బాలయ్యతో `అఖండ` చిత్రం చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఏకంగా 130కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఊహించని విజయంతో ఫెయిల్యూర్‌లో ఉన్న బాలయ్యకి, బోయపాటికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇక `బోయపాటిరాపో` కాంబోలో సినిమా కూడా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌గా ఉంటుందని, అయితే ఈ సారి బోయపాటి ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. మరి ఇది ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

బోయపాటి శ్రీను.. రామ్‌చిత్రం తర్వాత బన్నీతో సినిమా చేసే కమిట్‌మెంట్‌ ఉందని సమాచారం. మరోవైపు లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ నటిస్తున్న `ది వారియర్‌`చిత్రంలో యంగ్‌ సెన్సేషనల్‌ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అదిపినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది తెరపైకి రాబోతుంది.