భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన " ఆపరేషన్ సిందూర్" దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన " ఆపరేషన్ సిందూర్" దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ' ఆపరేషన్ సిందూర్ ' టైటిల్ కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది.
చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ' ఆపరేషన్ సిందూర్ ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేసుకునేందుకు అనేక ప్రొడక్షన్ హౌసులు ఆసక్తి చూపుతున్నాయి. ఈ టైటిల్ పై హక్కులు పొందేందుకు నిన్నటి నుంచి అనేక సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ రేసులో ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ కంటే ముందుగా టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినవారు మాహవీర్ జైన్ ఫిల్మ్స్నేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అంతే కాకుండా, ప్రతిష్టాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన మధుర్ భండార్కర్ కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆయన గతంలో 'ట్రాఫిక్ సిగ్నల్', 'పేజ్ 3', 'చాందిని బార్' వంటి సినిమాల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీరితో పాటు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం టీ సిరీస్, జీ స్టూడియోస్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయట. మొత్తం 15 నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ టైటిల్ను ఎవరు పొందుతారన్నదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. రెండు ప్రముఖ పేర్లు ముందుకు రావడం చూస్తుంటే, ఇది ఒక భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ పేరిట తెరకెక్కే సినిమా పక్కా దేశభక్తి నేపథ్యంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి టైటిల్ ఎవరి వద్దకు వెళ్లబోతోందన్నదే అసలు ప్రశ్నగా మారింది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అందుతున్న సమాచారం మేరకు జీ స్టూడియోస్ సంస్థ ఆపరేషన్ సిందూర్ టైటిల్ రేసులో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తమ అప్లికేషన్ ని ఉపసంహరించుకున్నారట. తమ అనుమతి లేకుండా ఒకరు సంస్థ తరుపున దరఖాస్తు చేసుకున్నారట. దీనితో వెంటనే స్పందించిన జీ స్టుడియోస్ అప్లికేషన్ వెనక్కి తీసుకుంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ కి సంబంధించిన టైటిల్ ని ఉపయోగించుకునే ఉద్దేశం తమకి లేదని జీ స్టుడియోస్ పేర్కొంది.